దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్.. టీమిండియా పర్యటనపై సందిగ్ధం
ABN , First Publish Date - 2021-11-27T00:19:24+05:30 IST
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ బయటపడి ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనపై సందిగ్ధత నెలకొంది. డిసెంబరు 17 నుంచి భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్లలో ఇరు జట్లు తలపడనున్నాయి.
దక్షిణాఫ్రికాలో తాజాగా కరోనా వైరస్లో కొత్త ఉత్పరివర్తనాన్ని కనుగొన్నారు. బి.1.1.529 అనే ఈ కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఇప్పటికే అక్కడి శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబరు 8న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లే విషయమై ప్రభుత్వ ఆదేశాల కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది.