దక్షిణాఫ్రికా పర్యటన యథాతథం.. ప్రస్తుతానికి టీ20 సిరీస్కు స్వస్తి
ABN , First Publish Date - 2021-12-05T02:43:13+05:30 IST
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో సందిగ్ధంలో పడిన భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనపై స్పష్టత
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో సందిగ్ధంలో పడిన భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనపై స్పష్టత వచ్చింది. పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు జరగాల్సి ఉండగా, ప్రస్తుతానికి టీ20 సిరీస్ను పక్కనపెట్టారు.
తొలుత అనుకున్న షెడ్యూలు ప్రకారం డిసెంబరు 17న జొహన్నెస్బర్గ్లో తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఒమిక్రాన్ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో తొలి టెస్టు కాస్తంత ఆలస్యంగా ఈ నెల 26న ప్రారంభం అవుతుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించడంతో పర్యటనపై ఇంతకాలం కొనసాగిన సందిగ్ధతకు తెరపడింది.
ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతున్న నేపథ్యంలో కఠిన నిబంధలనల మధ్యే సిరీస్ జరుగుతుందని క్రికెట్ సౌతాఫ్రికా (సీఏ) పేర్కొంది. మరో 48 గంటల్లో మిగతా మ్యాచ్ల వేదికలను ప్రకటిస్తామని తెలిపింది. పర్యటన ఖరారు కావడంతో న్యూజిలాండ్తో ముంబైలో జరుగుతున్న రెండో టెస్టు ముగిసిన వెంటనే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్తుంది.