భారత్లో పరిస్థితులు చాలా విషాదకరం: కమలా హ్యారిస్
ABN , First Publish Date - 2021-05-01T14:53:01+05:30 IST
మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్లో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. కరోనాతో వీరోచితంగా పోరాడుతున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా సాయం చేసే విషయమై కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కమల స్పష్టం చేశారు.
వాషింగ్టన్: మహమ్మారి కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్లో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. కరోనాతో వీరోచితంగా పోరాడుతున్న భారత్కు అగ్రరాజ్యం అమెరికా సాయం చేసే విషయమై కట్టుబడి ఉందని ఈ సందర్భంగా కమల స్పష్టం చేశారు. శుక్రవారం ఒహియోలోని సిన్సినాటిలో మీడియాతో మాట్లాడిన ఉపాధ్యక్షురాలు.. "భారత్లో పరిస్థితులు కచ్చితంగా చాలా విషాదకరమైనవి. మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మేము ఇంతకు ముందు చెప్పాం, ఇప్పుడు చెబుతున్నాం.. భారత్కు సాయం చేసే విషయమై యూఎస్ సిద్ధంగా ఉంటుంది. పీపీఈ కిట్లు, ఇతర వైద్య పరికరాలకు ఇప్పటికే అమెరికా సాయం చేసింది. కరోనాతో కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్న భారత ప్రజలు త్వరగా వాటి నుంచి బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను." అని అన్నారు.
ఇక అగ్రరాజ్యం పంపించిన తన తొలి అత్యవసర వైద్య సాయం శుక్రవారం న్యూఢిల్లీ చేరింది. అమెరికా నుంచి ఢిల్లీకి ప్రత్యేక మిలిటరీ విమానంలో 440 ఆక్సిజన్ సిలిండర్లు, 9.60 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లతో పాటు లక్ష ఎన్-95 మాస్కులు, ఇతర వైద్య పరికరాలు చేరుకున్నాయి. ఇదిలాఉంటే.. మే4 నుంచి ఇండియా నుంచి వచ్చే రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు యూఎస్ వెల్లడించింది. భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి పేర్కొన్నారు.