వరుస విక్రయాలు... ఉసూరుమంటోన్న భారతీయులు...

ABN , First Publish Date - 2022-01-28T21:24:25+05:30 IST

భారతీయుల డాలర్‌ డ్రీమ్‌ చెదురుతోంది. అమెరికాలో లిస్టైన పాపులర్‌ టెక్‌, న్యూ ఏజ్‌ స్టాక్‌‌లపై పందేలు కట్టిన భారతీయులు... కొన్ని నెలలుగా వాటిలో చోటుచేసుకుంటోన్న వరుస అమ్మకాలతో ఉసూరుమంటున్నారు.

వరుస విక్రయాలు... ఉసూరుమంటోన్న భారతీయులు...

చోదురుతున్న డాలర్ డ్రీం...

యూఎస్‌ న్యూ ఏజ్‌, టెక్‌ స్టాక్స్‌కు వీడ్కోలు...

న్యూఢిల్లీ : భారతీయుల డాలర్‌ డ్రీమ్‌ చెదురుతోంది. అమెరికాలో లిస్టైన పాపులర్‌ టెక్‌, న్యూ ఏజ్‌ స్టాక్‌‌లపై పందేలు కట్టిన భారతీయులు...  కొన్ని నెలలుగా వాటిలో చోటుచేసుకుంటోన్న వరుస అమ్మకాలతో ఉసూరుమంటున్నారు. మెల్లగా ఆయా అమెరికన్‌ స్టాక్స్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. బదులుగా, వడ్డీ రేట్ల పెంపును తట్టుకుని నిలబడగల పెద్ద, ఎస్టాబ్లిష్‌డ్‌ కంపెనీల దిశగా దృష్టి సారించారు. ఈ క్రమానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలున్న బెంచ్‌మార్క్ నాస్‌డాక్ ఇండెక్స్ ఈ నెలలో ఇప్పటివరకు 15 % మేర పడిపోయింది. నెట్‌ఫ్లిక్స్, టెస్లా, రాబిన్‌హుడ్ వంటి కొన్ని స్టాక్స్‌ తమ మార్కెట్ క్యాప్‌లో 30-40 % వరకు నష్టపోయాయి. ‘మా ప్లాట్‌ఫామ్‌లోని పలువురు పెట్టుబడిదారులు డిసెంబరు  మధ్య నుంచి లాభాలు బుక్‌ చేస్తున్నారు. టెస్లా, రాబిన్‌హుడ్, నెట్‌ఫ్లిక్స్‌ వీటిలో కొన్ని. మరోవైపు... ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, గోల్డ్‌మెన్‌ సాచ్స్‌ వంటివి జనాదరణ పొందుతున్నాయి. ఇటీవలి కాలంలో వీటిలో అధిక ట్రేడింగ్ వాల్యూమ్స్‌ చూస్తున్నాం‘ అని స్టాకాల్ సహ వ్యవస్థాపకుడు సితాశ్వ శ్రీవాస్తవ పేర్కొన్నారు. కాగా... ఈ క్రమానికి సంబంధించి మరికొన్ని వివరాలిలా ఉన్నాయి. 


భారతీయులు గత సంవత్సర కాలంగా వివిధ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా అమెరికన్‌ షేర్లను కొనుగోలు చేయడంతోపాటు, యూఎస్‌ స్టాక్స్‌ మీద దృష్టి పెట్టే లోకల్‌ మ్యూచువల్ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టారు. వీరంతా బుల్లిష్‌ మొమెంటంను ఆశించారు. కాగా... యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్ హాకిష్ ఐ కారణంగా మొమెంటం తారుమారైంది. దీంతో రిస్క్ తీసుకోవడం క్రమంగా తగ్గించారు. ఇటీవలి కాలంవరకు, టెక్నాలజీ కంపెనీల నుంచి ఏ సానుకూల వార్త వచ్చినా పెట్టుబడిదారులు తెగ ఉత్సాహపడ్డారు. దీనివల్ల అటువంటి స్టాక్స్‌ బాగా పెరిగి, హై వాల్యుయేషన్‌కు దారితీశాయి. ఇక పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఏదైనా ప్రతికూల వార్త, లేదా... తక్కువ పనితీరు కనిపిస్తే మాత్రం ఈ బుడగ పేలిపోవడం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యానాలు ఈ సందర్భంగా వినవస్తున్నాయి 

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో వివిధ సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న లిక్విడిటీ చర్యల కారణంగా, 2020 మే తర్వాత అమెరికా సహా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా పెరిగాయి. 2020 ఏప్రిల్ నాటి కనిష్ట స్థాయి నుంచి నాస్‌డాక్ దాదాపు రెండింతలు పెరిగింది. ఇక... 2021 లో ఇండెక్స్ 20 శాతానికి పైగా వృద్ధి చెందింది, న్యూ-ఏజ్‌ కంపెనీలు దీనిలో బాగా లబ్ధి చెందాయి. ఇప్పుడవే నష్టపోతున్నాయి. బలమైన వ్యాపారం, మంచి క్యాష్‌ ఫ్లోస్‌ కారణంగా కొన్ని లీడింగ్‌ టెక్నాలజీ స్టాక్స్‌కు ఈ పరిస్థితి నుంచి మినహాయింపు ఉండవచ్చునని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2022-01-28T21:24:25+05:30 IST