అమెరికా ‘మత’ నివేదికపై నిరసనలు
ABN , First Publish Date - 2022-04-29T12:21:52+05:30 IST
చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్తోపాటు భారత్లోనూ మత స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ ఓ అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదికను హిందూసంస్థలు ఆక్షేపిస్తున్నాయి. ‘హిందూఫోబియా’తో ఈ నివేదిక నిండిపోయిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘హిందూపాక్ట్’ అనే హిందూ సంస్థల సమాఖ్య విమర్శించింది.
భారత్లో మతస్వేచ్ఛ లేదనడంపై ఆగ్రహం
వాషింగ్టన్, ఏప్రిల్ 28: చైనా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్తోపాటు భారత్లోనూ మత స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ ఓ అంతర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదికను హిందూసంస్థలు ఆక్షేపిస్తున్నాయి. ‘హిందూఫోబియా’తో ఈ నివేదిక నిండిపోయిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘హిందూపాక్ట్’ అనే హిందూ సంస్థల సమాఖ్య విమర్శించింది. మతస్వేచ్ఛ విషయంలో భారత్ను ‘ప్రత్యేకంగా ఆందోళన’కు గురిచేస్తున్న దేశాల జాబితాలో చేర్చాలంటూ యూఎస్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్.. అనే సంస్థ బుధవారం అమెరికా ప్రభుత్వానికి నివేదించింది. మొత్తం 11 దేశాలను ఆ జాబితాలో అది చేర్చింది. ఈ నివేదికను హిందూసంస్థలు వ్యతిరేకిస్తుండగా, క్రైస్తవ, ఇస్లాం సంస్థలు స్వాగతిస్తున్నాయి. కమిషన్లోని సభ్యులు ఇండోఫోబియా, హిందూఫోబియాతో బాధపడుతున్నారంటూ ‘హిందూపాక్ట్’ గురువారం ఓ ప్రకటనలో ఆక్షేపించింది.
భగవద్గీతతో బైబిల్ను పోల్చవద్దు: బీసీ నాగేష్భగవద్గీత పూర్తిగా నైతిక విలువలను ప్రబోధించే గ్రంథమని, దానిని మత గ్రంథమైన బైబిల్తో పోల్చడం సరికాదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ సూచించారు. కర్ణాటక విద్యాసంస్థల్లో మత బోధనకు అవకాశం ఇవ్వబోమని, అది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో పాఠ్యాంఽశంగా భగవద్గీతను ప్రభుత్వమే ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, బైబిల్ బోధిస్తే తప్పేమిటని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై మంత్రి పై విధంగా స్పందించారు. మరోవైపు, ఇతరుల ఇంటి వద్దకు వెళ్లి.. మతపరమైన పఠనాలు చేస్తే.. అది వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని బాంబే హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామంటూ ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు ప్రకటించిన విషయం తెలిసిందే. వారిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ రాణా దంపతులు బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ధర్మాసనం రాణా దంపతుల పిటిషన్ను కొట్టివేసింది. కాగా, ఇతర మతస్థులను వేధించేలా మతపరమైన విశ్వాసాల ప్రదర్శన అవలక్షణమని.. ఆ పద్ధతి సరైంది కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మరోవైపు, బనారస్ హిందూ వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీకి చెందిన మహిళా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వీసీ హాజరయ్యారు. దీన్ని హిందూ వ్యతిరేకచర్యగా అభివర్ణించిన విద్యార్థులు.. ఆందోళనకు దిగారు.