హాకీ అమ్మాయిల ‘టైం’ బాగోలేదు!

ABN , First Publish Date - 2022-08-07T09:34:01+05:30 IST

వివాదాస్పద నిర్ణయం.. భారత మహిళల హాకీ జట్టుకు అశనిపాతమైంది. నాలుగుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాపై స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసినా..

హాకీ అమ్మాయిల ‘టైం’ బాగోలేదు!

అంపైర్‌ వివాదాస్పద నిర్ణయం 

సెమీస్‌లో భారత్‌ షూటౌట్‌

 ఇక కాంస్యం కోసం పోరాటం


బర్మింగ్‌హామ్‌: వివాదాస్పద నిర్ణయం.. భారత మహిళల హాకీ జట్టుకు అశనిపాతమైంది. నాలుగుసార్లు చాంపియన్‌ ఆస్ట్రేలియాపై స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసినా.. ‘క్లాక్‌ సిద్ధం కాలేదనే’ అంపైర్‌ నిర్ణయంతో షూటౌట్‌లో డీలాపడింది. శనివారం జరిగిన సెమీస్‌ మ్యాచ్‌లో భారత్‌ 1-1 (0-3)తో ఆసీస్‌ చేతిలో పరాజయం చవిచూసింది. 10వ నిమిషంలో గ్రీనర్‌ గోల్‌తో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ, 49వ నిమిషంలో వందనా కటారియా గోల్‌ చేసి 1-1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత మరో గోల్‌ లేకపోవడంతో ఫలితం షూటౌట్‌కు దారితీసింది. 


అంపైర్‌ తప్పిదం..:

పెనాల్టీ షూటౌట్‌లో భాగంగా ఆసీస్‌ ప్లేయర్‌ రోసీ మలోనే తొలిషాట్‌ తీసుకొంది. అయితే, ఆమెను భారత గోల్‌ కీపర్‌ సవితా సమర్థంగా అడ్డుకుంది. కానీ, ఈలోగా అంపైర్‌ వచ్చి మళ్లీ షాట్‌ తీసుకోవాలని సూచించింది. ఇదేంటని టీమిండియా సభ్యులు ప్రశ్నిస్తే.. షూటౌట్‌ క్లాక్‌లో తప్పిదం జరిగిందని.. అందుకే రీ షాట్‌ తీసుకోవాలని చెప్పింది. రెండోసారి రోసీ మిస్‌ కాలేదు. ఆ తర్వాత కైట్లిని, అమె లాటన్‌ గోల్స్‌ చేశారు. కానీ, అంపైర్‌ నిర్ణయం భారత్‌ ఆటపై ప్రతికూల ప్రభావం చూపించింది.


లాల్‌రిమ్సియామి, నేహా గోయల్‌, నవ్‌నీత్‌ కౌర్‌లు గోల్స్‌ చేయలేకపోయారు. కాగా, అంపైర్‌ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో పెద్దత్తున విమర్శలు రావడంతో.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనపై సమీక్షిస్తామని పేర్కొంది. కాగా, సెమీస్‌లో ఓటమితో భారత అమ్మాయిలు ఇక కాంస్య పతకం కోసం పోరాటం చేయనున్నారు. ఆదివారం జరిగే కాంస్య పతక పోరులో న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. మరో సెమీ్‌సలో ఇంగ్లండ్‌ 2-0తో న్యూజిలాండ్‌ను షూటౌట్‌ చేసి ఫైనల్లో ఆసీ్‌సతో అమీతుమీకి సిద్ధమైంది. 


తుది సమరానికి పురుషుల జట్టు 

పురుషుల హాకీలో భారత జట్టు ఫైనల్‌ చేరింది.  సెమీఫైనల్లో భారత్‌ 3-2 గోల్స్‌ తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి ఫైనల్‌ చేరింది. భారత్‌ తరఫున అభిషేక్‌, మన్‌దీప్‌, జుగ్రాజ్‌ తలా గోల్‌ సాధించారు. 

Updated Date - 2022-08-07T09:34:01+05:30 IST