భారత జట్లు.. అదే జోరు
ABN , First Publish Date - 2022-07-31T08:43:06+05:30 IST
చెస్ ఒలింపియాడ్ రెండో రోజు పోటీల్లోనూ భారత జట్లు దుమ్ము రేపాయి. శనివారం జరిగిన రెండో రౌండ్లోనూ ఆరు భారత జట్లు తమ ప్రత్యర్థులపై గెలుపొందాయి.
చెస్ ఒలింపియాడ్లో రెండో రోజూ విజయాల మోత
బోణీ చేసిన హరికృష్ణ, కార్ల్సన్
చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్ ఒలింపియాడ్ రెండో రోజు పోటీల్లోనూ భారత జట్లు దుమ్ము రేపాయి. శనివారం జరిగిన రెండో రౌండ్లోనూ ఆరు భారత జట్లు తమ ప్రత్యర్థులపై గెలుపొందాయి. తొలి రౌండ్లో ఆడని తెలుగు గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ, వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) రెండో రౌండ్లో బరిలోకి దిగి విజయాలతో టోర్నమెంట్ను ఆరంభించారు. తెలుగు గ్రాండ్ మాస్టర్లు కొనేరు హంపి, అర్జున్, ప్రత్యూష డ్రాలతో సరిపెట్టుకున్నారు. నార్వే రెండో రౌండ్లో 4-0తో ఉరుగ్వేను చిత్తు చేయగా, జార్జ్ మైర్ను ఓడించి కార్ల్సన్ టోర్నీలో ఖాతా తెరిచాడు. పురుషుల కేటగిరీలో హరికృష్ణ నేతృత్వంలోని భారత జట్టు 3.5-0.5తో మాల్దోవా జట్టుపై నెగ్గింది. హరికృష్ణ, నారాయణ్, శశికిరణ్ విజయాలు సాధించగా అర్జున్ డ్రా చేసుకున్నాడు. నల్ల పావులతో బరిలోకి దిగిన హరి 38 ఎత్తుల్లో ప్రత్యర్థి ఇవాన్కు చెక్ పెట్టగా, తెల్ల పావులతో ఆడిన అర్జున్ 46 ఎత్తుల తర్వాత ఆండ్రీతో డ్రాకు అంగీకరించాడు. ఎస్తోనియా జట్టుతో తలపడిన భారత-2 టీమ్ 4-0తో క్లీన్స్వీప్ చేసింది. గుకేష్, ప్రజ్ఞానంద, అధిబన్, రౌనక్ సద్వానీ ప్రత్యర్థులను చిత్తు చేశారు. మెక్సికోను ఢీకొట్టిన భారత-3 జట్టు 2.5-1.5తో పోరాడి గెలిచింది. సూర్యశేఖర్, అభిజీత్, సేతురామన్ తమ గేమ్లను డ్రా చేసుకోగా, నిర్ణయాత్మక ఆఖరి మ్యాచ్లో కార్తికేయన్ మురళి 35 ఎత్తుల్లో ప్రత్యర్థి కాపో విడల్ను ఓడించి భారత్-3ని విజేతగా నిలిపాడు.
అదరగొట్టిన అమ్మాయిలు..: హంపి నాయకత్వంలోని భారత జట్టు 3.5-0.5తో అర్జెంటీనాపై నెగ్గింది. తెల్ల పావులతో బరిలోకి దిగిన హంపి 44 ఎత్తుల అనంతరం డ్రాకు ఆమోదించగా, తానియా, భక్తి కులకర్ణి, వైశాలి ప్రత్యర్థులను ఓడించారు. భారత-2 టీమ్ కూడా 3.5-0.5తో లాత్వియాను చిత్తు చేసింది. వంతికా, మేరీ, సౌమ్య విజయాలు సాధించగా, పద్మినీ రౌత్ డ్రాతో సరిపెట్టుకుంది. భారత-3 జట్టు 3-0తో సింగపూర్ను ఓడించింది. ఇషా, నందిదా నెగ్గగా, ప్రత్యూష, విశ్వ గేమ్లను డ్రా చేసుకున్నారు.