ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో భారతీయులకు నరకం.. విద్యార్థులపైకి కారం స్ప్రే..అమ్మాయిలను ఎత్తుకెళ్తున్న సైనికులు!

ABN , First Publish Date - 2022-03-01T13:12:09+05:30 IST

ఉక్రెయిన్‌ పొరుగుదేశం సరిహద్దుల్లో రోడ్డుపై కూర్చున్న భారతీయ విద్యార్థులు. ఆడ, మగ అనే తేడా లేకుండా వారిని కొడుతూ, కాలితో తన్నుతూ, జట్టు పట్టి ఈడ్చుకుంటూ నెట్టివేస్తున్న అక్కడి సైనికులు. గంపుపైకి వాహనం నడుపుకొంటూ వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్న పోలీసులు. విద్యార్థులపైకి కాల్పులు జరుపుతూ గాయపరుస్తున్న బలగాలు.

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో భారతీయులకు నరకం.. విద్యార్థులపైకి కారం స్ప్రే..అమ్మాయిలను ఎత్తుకెళ్తున్న సైనికులు!

కారం చల్లుతున్నారు.. పెప్పర్‌ స్ప్రే కొడుతున్నారు

తీవ్ర భయాందోళనతో రోదిస్తున్న విద్యార్థులు

విద్యార్థుల వద్దకు వెళ్లనున్న కేంద్ర మంత్రులు

తలపై తుపాకీ పెట్టి కాల్చేస్తామన్నారు

సరిహద్దుల్లో మాలా వేలాదిమంది.. వారినీ తేవాలి

ఉక్రెయిన్‌ నుంచి తెలంగాణ చేరుకున్న విద్యార్థులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ఉక్రెయిన్‌ పొరుగుదేశం సరిహద్దుల్లో రోడ్డుపై కూర్చున్న భారతీయ విద్యార్థులు. ఆడ, మగ అనే తేడా లేకుండా వారిని కొడుతూ, కాలితో తన్నుతూ, జట్టు పట్టి ఈడ్చుకుంటూ నెట్టివేస్తున్న అక్కడి సైనికులు. గంపుపైకి వాహనం నడుపుకొంటూ వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తున్న పోలీసులు. విద్యార్థులపైకి కాల్పులు జరుపుతూ గాయపరుస్తున్న బలగాలు. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని స్వదేశానికి చేరుకునేందుకు పొరుగు దేశాల సరిహద్దులకు చేరుకున్న భారతీయ విద్యార్థులకు ఎదురవుతున్న దారుణమైన పరిస్థితులివి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌ గగనతలాన్ని మూసివేయడం, దీంతో అక్కడ చిక్కుకున్న విద్యార్థులను పశ్చిమ సరిహద్దుల్లోని దేశాల నుంచి స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. 


రొమేనియా, హంగరీ, పోలండ్‌, స్లొవేకియాల నుంచి భారత విమానాలు వారిని తరలిస్తుండగా.. ఆయా దేశాల సరిహద్దుల వద్దకు వారు చేరుకోవడమే అత్యంత క్లిష్టంగా మారింది. ఎలాగోలా అక్కడికి చేరుకున్న వారిని భద్రతా బలగాలు తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితులు వీడియోలు తీసి స్వదేశంలోని తమ కుటుంబ సభ్యులకు పంపిస్తున్నారు. ఉక్రెయిన్‌-పోలండ్‌ బోర్డర్‌ వద్ద రోడ్డుపై కూర్చున్న విద్యార్థులను కాలితో తన్నుతున్న దృశ్యం, విద్యార్థులపైకి కారును నడుపుకొంటూ రావడం, విద్యార్థుల లగేజీని రోడ్డుపైకి విసిరికొడుతున్న దశ్యాలతో కూడిన వీడియోలను విద్యార్థులు పంపించారు. భారతీయులు, నైజీరియన్లను నిలిపివేస్తున్నారని చెప్పారు.  


విద్యార్థులపైకి కారం స్ప్రే..!

సరిహద్దు వద్ద వేచి ఉన్న భారతీయ విద్యార్థులపైకి స్లొవేకియా పోలీసులు కారం చల్లారు. పెప్పర్‌ స్ర్పే కొట్టారు. మూడుసార్లు ఇలా చేశారని మాళవిక అనే విద్యార్థిని రోదిస్తూ చెప్పారు. తాము 12 గంటలుగా తిండి, నీరు లేకుండా అక్కడ వేచి చూస్తున్నామని, సహాయం కోసం స్లొవేకియా ఎంబసీకి ఫోన్‌ చేస్తే అది పనిచేయడం లేదని తెలిపారు. హెల్ప్‌లైన్‌ నంబర్లేవీ పనిచేయడంలేదని, ఏం చేయాలో తెలియడం లేదని తీవ్ర ఆందోళనతో చెప్పారు. ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తిరిగి వస్తామనే ఆశ రోజురోజుకూ సన్నగిల్లుతోందని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన అధివేశ్‌ ధామా అన్నారు.


సరిహద్దులు దాటి వచ్చిన వారిని మాత్రమే భారత రాయబార కార్యాలయం స్వదేవానికి పంపిస్తోందని, కానీ.. తాము సరిహద్దులకు చేరుకునే మార్గం లేదని అన్నాడు. అక్కడి వరకు చేరిస్తే రూ.10-20 లక్షలు ఇస్తామని చెప్పినా బస్సు డ్రైవర్లు తీసుకెళ్లడం లేదని వాపోయాడు.‘‘నాలుగు రోజులుగా ఖర్కివ్‌ మెట్రో స్టేషన్‌లో తలదాచుకున్నాం. మరో 500 మంది ఇక్కడే ఉన్నారు. బాంబుల వర్షం కురుస్తుండడంతో బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఆహారం ఎప్పుడు తిన్నామో కూడా తెలియదు’’ కేరళకు చెందిన ఎలిజబెత్‌ అనే విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు.  


సరిహద్దులకు ప్రత్యేక రైళ్లు 

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను పశ్చిమ దేశాల సరిహద్దులకు చేర్చేందుకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. సోమవారం కీవ్‌లో కర్ఫ్యూను నడలించినందున విద్యార్థులు రైల్వేస్టేషన్‌కు చేరుకొని వాటిలో ప్రయాణించాలని సూచించింది. ఇప్పటివరకు స్వదేశానికి తరలించిన వారి సంఖ్య 2 వేలు దాటిందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు. తమ దేశంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ భారతీయులు స్వదేశానికి తరలి వెళ్లేందుకు తాము అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నామని ఉక్రెయిన్‌ దౌత్యాధికారి ఐగర్‌ పొలిఖా తెలిపారు. అయితే వారి భద్రతపై హామీ మాత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఇవ్వాలని వ్యాఖ్యానించారు.   


ఉక్రెయిన్‌కు భారత్‌ మానవతా సాయం

యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు భారత్‌కు మానవతా సాయం అందించాలని నిర్ణయించినట్లు విదాశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. 


అమ్మాయిలను ఎత్తుకెళ్తున్న సైనికులు!

ఉక్రెయిన్‌ నుంచి బయటపడేందుకు పొరుగుదేశాల సరిహద్దుల వద్దకు చేరుకుంటున్న భారతీయ విద్యార్థినులను రష్యా సైనికులు తమ స్నేహితులపై కాల్పులు జరిపారని, కొందరు అమ్మాయిలను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవ్‌కు చెందిన ఓ యువతి ఏడుస్తూ వివరించింది. ‘‘ప్రధాని మోదీ, సీఎం యోగి.. భారత సైన్యాన్ని ఇక్కడికి పంపించి మమ్మల్ని కాపాడండి’’ అంటూ చేతులు జోడించి వేడుకుంది.  ఈ వీడియోను కాంగ్రెస్‌ నేత ప్రియాంకాగాంధీ వాద్రా షేర్‌ చేశారు.


ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు.. నలుగురు కేంద్ర మంత్రులు

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దూతలుగా నలుగురు కేంద్ర మంత్రులను దాని సరిహద్దు దేశాలకు పంపనుంది. వీరు.. విద్యార్థులు సహా భారతీయుల తరలింపును పర్యవేక్షించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ ప్రక్రియలో విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా.. రొమేనియా, మాల్దోవాలకు వెళ్లనున్నారు. కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరెన్‌ రిజిజు స్లొవేకియాకు, పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి హంగరీకి, కేంద్ర రోడ్డు, రవాణా, విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్‌ వీకే సింగ్‌ పోలండ్‌ వెళ్తారు. 


పొరుగు దేశాల వారినీ తరలిస్తాం..

ప్రధాని మోదీ సోమవారం మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉక్రెయిన్‌ నుంచి పొరుగు, పేద దేశాలవారినీ తరలించేందుకు సాయం చేస్తామన్నారు. అనంతరం స్లొవేకియా, రొమేనియా దేశాధ్యక్షులతో మాట్లాడారు. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. 



Updated Date - 2022-03-01T13:12:09+05:30 IST