రామకృష్ణరాజుకు ఇండియన్ పోలీస్ మెడల్
ABN , First Publish Date - 2022-08-12T05:39:05+05:30 IST
జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కళాశాలలో హెచ్సీగా విధులు నిర్వహించి 2020లో ఉద్యోగ విరమణ పొందిన నడింపల్లి రామకృష్ణరాజుకు ఇండియన్ పోలీసు మెడల్ లభించింది.
2020కి గాను ఎంపిక చేసిన ప్రభుత్వం
విజయనగరం క్రైం, ఆగస్టు 11: జిల్లా కేంద్రంలోని పోలీసు శిక్షణ కళాశాలలో హెచ్సీగా విధులు నిర్వహించి 2020లో ఉద్యోగ విరమణ పొందిన నడింపల్లి రామకృష్ణరాజుకు ఇండియన్ పోలీసు మెడల్ లభించింది. ఈయన 1980లో ఏపీఎస్పీ బెటాలియన్లో కానిస్టేబుల్గా ప్రవేశించి వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. అనంతరం 2000 నుంచి 2013 వరకు ఆర్ముడ్ రిజర్వు(ఏఆర్)లో వీఐపీలకు గన్మెన్, ఇంటిలిజెన్స్ విధులు(హైదరాబాద్ యూనిట్), ఎస్కార్ట్స్, బందోబస్తు తదితర బాధ్యతలు చూశారు. అనంతరం పోలీసు శిక్షణ కళాశాలలో ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేశారు.2020 జనవరి 20న హెచ్సీగా పదవీ విరమణ పొందారు. ఈయనకు 2020కి గాను ఇండియన్ పోలీసు మెడల్కు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా మెడల్ అందుకోనున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణరాజును పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు బంధువులు అభినందించారు.