ఆటగాళ్లు చచ్చేంత భయంతో వణికిపోయారు: గంగూలీ

ABN , First Publish Date - 2021-09-13T22:57:03+05:30 IST

భారత జట్టు బృందంలోని ఫిజియో యోగేజ్ పర్మార్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగానే ఆటగాళ్లు భయపడిపోయారని బీసీసీఐ

ఆటగాళ్లు చచ్చేంత భయంతో వణికిపోయారు: గంగూలీ

న్యూఢిల్లీ: భారత జట్టు బృందంలోని ఫిజియో యోగేజ్ పర్మార్‌కు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగానే ఆటగాళ్లు భయపడిపోయారని బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్‌లో జరగాల్సిన ఐదో టెస్టుకు ముందు యోగేశ్‌కు కరోనా సోకినట్టు తెలియగానే భారత ఆటగాళ్లు మైదానంలోకి దిగేందుకు నిరాకరించారు. అంతకుముందు హెడ్‌కోచ్ రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ కరోనా బారినపడ్డారు. 


మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్ చేసేందుకు ఉన్న అవకాశాలపై ఇంగ్లండ్ క్రికెట్ ప్రతినిధులతో చర్చించేందుకు గంగూలీ ఈ నెల 22న యూకే వెళ్లనున్నాడు. ఆటగాళ్లు ఆడేందుకు నిరాకరించారని, అంతమాత్రాన వారిని నిందించడం తగదని గంగూలీ పేర్కొన్నాడు. ఆటగాళ్లతో యోగేశ్ అంత సన్నిహితంగా మెలగడమే అందుకు కారణమని వివరించాడు. కొవిడ్-19 పరీక్షల తర్వాత కూడా అతడు జట్టు సభ్యులతో కలిసి మెలిసి తిరిగాడని అన్నాడు. ఆటగాళ్ల రోజువారీ జీవితంలో అతడు కూడా ఓ భాగమని, ఆటగాళ్లకు పర్మార్ మసాజ్ కూడా చేస్తుంటాడని గంగూలీ వివరించాడు. 


పర్మార్‌కు కరోనా సోకిందని తెలియగానే ప్లేయర్లు భయపడిపోయారని, తమకు కూడా కరోనా సోకే ఉంటుందని చచ్చేంత భయంతో వణికిపోయారని గంగూలీ పేర్కొన్నాడు. బబుల్‌లో ఉండడం అంత సులభమైన పనేమీ కాదని, ఏది ఏమైనా వారు తమ భావాలను గౌరవించారని గంగూలీ అన్నాడు. కాగా, శాస్త్రి, అరుణ్, శ్రీధర్ బుధవారం ఇండియా బయలుదేరుతారని గంగూలీ తెలిపాడు. 

Updated Date - 2021-09-13T22:57:03+05:30 IST