India tour of England: భారత ఆటగాడికి కరోనా!
ABN , First Publish Date - 2021-07-15T18:12:33+05:30 IST
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు షాక్ తగిలింది. ఓ భారత ఆటగాడు కరోనా బారిన పడ్డాడు.
లండన్: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లీ సేనకు షాక్ తగిలింది. ఓ భారత ఆటగాడు కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ఆటగాడిని మిగతా సభ్యులకు దూరంగా క్వారంటైన్లో ఉంచారు. ఈ నెల 18న (ఆదివారం) కరోనా టెస్టు నిర్వహించనున్నారు. ఈ టెస్టులో నెగెటివ్ వస్తే తిరిగి భారత జట్టుతో కలుస్తాడని బోర్డు పేర్కొంది. కాగా, ఆటగాడి పేరును బయటపెట్టలేదు. ఇక న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సీరిస్కు 40 రోజుల వ్యవధి ఉండడంతో ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అలాగే కుటుంబాలతో కలిసి బయటకు వెళ్లేందుకు కూడా అనుమతి ఇచ్చింది.
దాంతో భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ వీధుల్లో విహారించారు. వీరిలో కొందరు వింబుల్డన్, యూరో కప్ మ్యాచులకు కూడా వెళ్లినట్లు సమాచారం. తాజాగా విశ్రాంతి గడువు ముగియడంతో తిరిగి బయోబబుల్లో వెళ్లేముందు ఆటగాళ్లకు కరోనా పరీక్ష చేశారు. ఇందులో ఓ ఆటగాడికి కరోనా పాజిటివ్గా తేలింది. అతడికి డెల్టా వేరియంట్ సోకినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ ఆటగాడిని మిగతా సభ్యులకు దూరంగా క్వారంటైన్ చేశారు. పదో రోజు అంటే ఈ నెల 18న మరోసారి ఆటగాడికి కరోనా పరీక్ష నిర్వహించనున్నారు. దీంట్లో నెగెటివ్ వస్తే తిరిగి టెస్టు స్క్వాడ్తో కలుస్తాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.