అమెరికాలో భారతీయురాలి నిర్వాకం.. అప్పుడే పుట్టిన బిడ్డను..

ABN , First Publish Date - 2020-10-16T17:17:31+05:30 IST

అమెరికాలో 23 ఏళ్ల భారత సంతతి మహిళ అమానుషంగా ప్రవర్తించింది. తనకు పుట్టిన మగ బిడ్డను బాత్‌రూం కిటికీ నుంచి బయటకు విసిరేసింది.

అమెరికాలో భారతీయురాలి నిర్వాకం.. అప్పుడే పుట్టిన బిడ్డను..

న్యూయార్క్: అమెరికాలో 23 ఏళ్ల భారత సంతతి మహిళ అమానుషంగా ప్రవర్తించింది. తనకు పుట్టిన మగ బిడ్డను బాత్‌రూం కిటికీ నుంచి బయటకు విసిరేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ పసిగుడ్డు ఇప్పుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దాంతో ఈ దారుణానికి పాల్పడిన భారత మహిళపై హత్యాయత్నం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో నివాసం ఉండే సబితా దూక్రాం శనివారం రోజులాగే స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో బాత్‌రూంలోనే ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఒక్కసారిగా బిడ్డ బయట పడడంతో భయపడిపోయిన సబితా వెంటనే పసికందును బాత్‌రూం కిటికీలోంచి బయటకు విసిరేసింది. అనంతరం బాత్‌రూంను శుభ్రం చేయడంతో పాటు స్నానం చేసి వెళ్లి పడుకుంది. అయితే, పసికందు ఏడుపు విన్న ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి వెళ్లి చూశారు. వారికి తీవ్ర గాయాలతో ఉన్న బాబును కనిపించాడు. దాంతో పసికందును హూటాహూటిన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. 


వారి సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సబితాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు కంగుతిన్నారు. తాను స్నానం చేస్తుండగా బాబు బయటకు రావడంతో ఏం చేయాలో తెలియలేదని, అందుకే భయంతో కిటికీలోంచి బయటకు పడేసినట్లు చెప్పింది. అనంతరం స్నానం చేసి పడుకున్నట్లు తెలిపింది. దీంతో అమానుషంగా ప్రవర్తించిన సబితాపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, ప్రస్తుతం పసికందుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఐదు అడుగుల ఎత్తు నుంచి కింద పడేయడంతో బాబు తలకు గట్టి దెబ్బ తగిలింది. దీంతో మెదడులో రక్తస్రావం కావడంతో పాటు వాపు కూడా వచ్చింది. ప్రస్తుతం పసికందు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.  

Updated Date - 2020-10-16T17:17:31+05:30 IST