అమెరికాలో భారతీయుడిని హత్య చేసిన దుండగులు .. దాడిపై అబద్దాలు చెబుతున్న పోలీసులు!

ABN , First Publish Date - 2022-06-27T15:28:16+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కొనసాగుతున్న తుపాకీ కల్చర్‌కు మరో భారతీయుడు బలయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. ఆదివారం ఉదయానికి కూడా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించలేదు. దుం

అమెరికాలో భారతీయుడిని హత్య చేసిన దుండగులు .. దాడిపై అబద్దాలు చెబుతున్న పోలీసులు!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో కొనసాగుతున్న తుపాకీ కల్చర్‌కు మరో భారతీయుడు బలయ్యాడు. శనివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. ఆదివారం ఉదయానికి కూడా పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించలేదు. దుండగులు భారతీయుడిని హత్య చేయడానికి గల కారణం కానీ.. దాడికి పాల్పడింది ఎవరు అనే వివరాలను కూడా వెల్లడించలేదు. కాగా.. న్యూయార్క్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్ ప్రాంతానికి సమీపంలో ఉన్న సౌత్ ఓజోన్ పార్క్ వద్ద జీపులో కూర్చొని ఉన్న భారత సంతతి వ్యక్తి సాత్నామ్ సింగ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతడు.. స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. ఆదివారం ఉదయానికి కూడా అధికారులు ఈ కేసులో పురోగతి సాధించలేక పోయారు. సాత్నామ్ సింగ్‌ను ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనే వివరాలను తెలుసుకోలేకపోయారు. దుండగులు నడుచుకుంటూ వచ్చి.. దాడి చేశారని పోలీసులు చెబుతుంటే.. స్థానికులు మాత్రం.. ఆ మాటలను ఖండిస్తున్నారు. కారులో వచ్చి భారతీయుడిపై కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన దృశ్యాలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాలో కూడా రికార్డు అయ్యాయని స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లోని రిచ్‌మండ్ హిల్‌ ఏరియాలో భారతీయులు ఎక్కవగా నివసిస్తూ ఉంటారు. గత కొన్ని రోజులుగా ఇక్కడి భారతీయులపై జాతి వివక్ష దాడులు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో ఇద్దరు భారతీయులపై అమెరికన్లు దాడికి తెగబడ్డ విషయం తెలిసిందే. 


Updated Date - 2022-06-27T15:28:16+05:30 IST