భారత సంతతి వైద్యుడికి పదేళ్ల 'గోల్డెన్ వీసా' !
ABN , First Publish Date - 2021-06-18T15:23:59+05:30 IST
భారత సంతతి బ్రిటిష్ వైద్యుడు రాజేష్ శర్మ యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు.
అబుధాబి: భారత సంతతి బ్రిటిష్ వైద్యుడు రాజేష్ శర్మ యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్నారు. ప్రత్యేక ప్రతిభావంతుల కేటగిరీలో ఆయనకు ఈ పదేళ్ల గోల్డెన్ వీసా లభించింది. తొమ్మిదేళ్లుగా రాజధాని అబుధాబిలో నివాసం ఉంటున్న రాజేష్ శర్మ స్థానికంగా ఉండే కార్నిచ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్గా పని చేస్తున్నారు. ప్రపంచంలో నివాసయోగ్యం పరంగా గానీ, పని పరంగా గానీ యూఏఈనే బెస్ట్ అని, గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన స్వస్థలం రాజస్థాన్లోని జైపూర్. 2001లో హై స్కిల్డ్ మిగ్రెంట్ ప్రోగ్రామ్ (హెచ్ఎస్ఎంపీ) కింద బ్రిటన్ వెళ్లారు. యూకేలో పన్నెండేళ్లు ఉన్న రాజేష్ శర్మ అక్కడే పీడియాట్రిక్స్ అండ్ నియోనాటాలజీలో ట్రైనింగ్ పూర్తి చేశారు. 2012లో యూఏఈ వచ్చిన తర్వాత రెండేళ్లు ఎన్ఎంసీ హెల్త్కేర్లో పని చేశారు.
2015 నుంచి కార్నిచ్ హాస్పిటల్లో పని చేస్తున్నారు. కార్నిచ్ హాస్పిటల్లో గోల్డెన్ వీసా అందుకున్న తొలి వైద్యుడు రాజేష్ శర్మనే కావడం విశేషం. ఇక తన భార్య పీహెచ్డీ హోల్డర్ అని, ఆమె కూడా గోల్డెన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అలాగే తన కూతురు యూకేలో మెడిసిన్ చేస్తుందని, కుమారుడు అబుధాబిలోని బ్రైటన్ కాలేజీలో చదువుతున్నట్లు రాజేష్ శర్మ చెప్పుకొచ్చారు.