Kuwait లో కుళ్లిన స్థితిలో లభ్యమైన భారతీయుడి మృతదేహం..!
ABN , First Publish Date - 2021-10-26T20:26:06+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్లో ఓ భారత వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్లో ఓ భారత వ్యక్తి మృతదేహం కుళ్లిన స్థితిలో లభ్యమైంది. ఫహాహీల్లోని ఓ పాడుబడ్డ భవనంలో అంతర్గత మంత్రిత్వశాఖ అధికారులు ఈ శవాన్ని గుర్తించారు. మృతుడిని భారత్లోని కేరళ రాష్ట్రం కొట్టాయంకు చెందిన మహ్మద్ అన్సర్గా గుర్తించడం జరిగింది. కాగా, అన్సర్ 20 రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని ప్రాథమిక ఫారెన్సిక్ నివేదికల ద్వారా తెలిసిందని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు. ఫహాహీల్లో స్థానికంగా ఉండే ఓ షాపులో అన్సర్ పనిచేస్తున్నట్లు తెలిసింది. 20 రోజుల కింద కనిపించకుండా పోయిన అన్సర్ ఇలా పాత భవనంలో శవమై కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కువైత్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్సర్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో అన్సర్ స్వస్థలమైన కొట్టాయంలో విషాదం అలుముకుంది. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.