భారత బాలికకు అరుదైన గౌరవం !
ABN , First Publish Date - 2020-06-06T13:38:34+05:30 IST
లాక్డౌన్ వేళ నిరుపేదలకు ఆహారం అందించడానికి తన చదువు కోసం పొదుపు చేసిన రూ.5లక్షలను తండ్రితో ఖర్చు చేయించిన మదురై బాలికకు అరుదైన గౌరవం దక్కింది.
ఐక్యరాజ్యసమితి నిరుపేదల రాయబారిగా నియామకం
చెన్నై, జూన్ 5(ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ వేళ నిరుపేదలకు ఆహారం అందించడానికి తన చదువు కోసం పొదుపు చేసిన రూ.5లక్షలను తండ్రితో ఖర్చు చేయించిన మదురై బాలికకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను ‘నిరుపేదల సౌహార్ద్ర రాయబారి (గుడ్విల్ అంబాసిడర్ ఫర్ ది పూర్)’గా ఐక్యరాజ్యసమితి నియమించింది. డిక్సాన్ స్కాలర్షిప్ కింద రూ.లక్ష నగదు బహుమతి కూడా ప్రకటించింది. మదురైలో సెలూన్ షాప్ నడుపుతున్న మోహన్ కుమార్తె నేత్ర 9వ తరగతి చదువుతోంది. ఆమె పై చదువుల కోసం మోహన్ రూ.5లక్షల వరకు పొదుపు చేశారు. లాక్డౌన్ సమయంలో ఆహారం కోసం నిరుపేదలు పడుతున్న అవస్థలు చూసి ఆ బాలిక చలించిపోయింది. తన చదువు కోసం దాచిన సొమ్ముతో వారికి బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేయాలని తండ్రిని కోరింది.
ఆ డబ్బుతో నిత్యావసరాలు, కూరగాయలు నెలరోజులకు పైగా పంపిణీ చేసి వారి ఆకలి తీర్చారు. గత ఆదివారం ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో మోహన్, ఆయన కుమార్తె నేత్ర మానవతా దృక్పథాన్ని, సేవలను ప్రధాని మోదీ ప్రశంసించారు. దీనిపై సమగ్ర సమాచారం సేకరించిన ఐక్యరాజ్యసమితికి చెందిన యూఎన్ఏడీఏపీ... ఆ బాలికను నిరుపేదల సౌహార్ద రాయబారిగా నియమించింది.