గంగూలీ తరువాతే ఆ అవకాశం వచ్చింది, కానీ క్యాన్సర్ దెబ్బతీసింది: యువరాజ్
ABN , First Publish Date - 2020-08-07T22:18:14+05:30 IST
జీవితంలో వచ్చిన ఉహకందని మలుపు కారణంగానే క్రికెట్కు దూరమయ్యానని ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఎలా ఉన్నా..
న్యూఢిల్లీ: జీవితంలో వచ్చిన ఉహకందని మలుపు కారణంగానే క్రికెట్కు దూరమయ్యానని ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఎలా ఉన్నా తన క్రీడా జీవితాన్ని ఎంతో ఆనందిస్తానన్నాడు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువరాజ్ తన క్రికెట్ కెరీర్కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. ‘ మొదట మిడిల్ ఆర్డర్లో ఆడటం కొంచెం ఇబ్బందిగా ఉండేది. నా పూర్తి సత్తా చూపలేకపోయేవాడిని. అయితే గంగూలీ రిటైర్మెంట్ తరువాతే మంచి అవకాశం వచ్చింది. సత్తా చాటేందుకు ఎన్నో మార్గాలు కనిపించాయి. కానీ జీవితం మాత్రం క్యాన్సర్ కారణంగా ఉహించని మలుపు తిరిగింది. అలా జరగక పోతే భారత జట్టు తరుపున మరి కొన్ని మ్యాచ్లు ఆడేవాడిని. ముఖ్యంగా టెస్ట్లపై ఎక్కువ దృష్టి సారించేవాడిని. ఏది జరిగిన ఓ ఆటగాడిగా నా ప్రయాణం ఎంతో సంతోషాన్ని కలిచింద’ని యువరాజ్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే 2000లో నిర్వహించిన ఐసీసీ నాక్ఔట్ కప్ టోర్నీ ద్వారా యువరాజ్ అంతర్జాతీయ స్థాయి క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లోనే ఆస్ట్రేలియాపై 84 పరుగులు చేసి మ్యాచ్ విన్నర్గా నిలిచాడు. అంతేకాకుండా 2002లో జరిగిన న్యాట్వెస్ట్ సిరీస్లోనూ తనదైన ఆటతీరును కనబరిచాడు. ముఖ్యంగా ఆ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో కైఫ్తో కలిసి అద్భుతంగా పోరాడాడు. 2011 ప్రపంచ కప్లో గొప్ప ఆల్రౌండర్గా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచి తన సత్తా చాటాడు. దీంతో క్రికెట్ అభిమానుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.