ఈ పార్శిల్‌ను మా వాళ్లకు ఇవ్వు.. అని అడిగితే సరేనన్నాడా వ్యక్తి.. గల్ఫ్‌లో దిగగానే చెక్ చేస్తే..

ABN , First Publish Date - 2022-02-11T17:05:39+05:30 IST

తెలిసిన వారు ఇచ్చిన పార్శిల్ తీసుకెళ్లడమే అతని పాలిట శాపంగా మారింది. ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 19 ఏళ్లు జైలు జీవితం గడిపేలా చేసింది.

ఈ పార్శిల్‌ను మా వాళ్లకు ఇవ్వు.. అని అడిగితే సరేనన్నాడా వ్యక్తి.. గల్ఫ్‌లో దిగగానే చెక్ చేస్తే..

మనామా: తెలిసిన వారు ఇచ్చిన పార్శిల్ తీసుకెళ్లడమే అతని పాలిట శాపంగా మారింది. ఒకటికాదు.. రెండుకాదు.. ఏకంగా 19 ఏళ్లు జైలు జీవితం గడిపేలా చేసింది. బహ్రెయిన్‌లో ఓ భారతీయ ప్రవాసుడికి ఎదురైన చేదు అనుభవం ఇది. అతడు తీసుకెళ్లిన పార్శిల్‌లో మత్తు పదార్థాలను గుర్తించిన బహ్రెయిన్ ఎయిర్‌పోర్టు అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దాంతో న్యాయస్థానం అతడికి జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి బహ్రెయిన్ జైలులోనే మగ్గుతున్నాడు. అయితే, గత కొంతకాలంగా అతడు జైలులో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మానవత దృక్పథంతో ఆలోచించిన బహ్రెయిన్ అధికారులు అతడ్ని జైలు నుంచి విడుదల చేశారు. దాంతో బుధవారం అతడు భారత్‌కు పయనమయ్యాడు. 2003లో చెన్నై నుంచి బహ్రెయిన్ మీదుగా సౌదీ అరేబియా వెళ్తున్న షాహుల్ హమీద్(64) అనే భారత వ్యక్తికి ఈ చేదు ఘటన ఎదురైంది.


అసలేం జరిగిందంటే.. సౌదీ అరేబియా రెసిడెంట్ అయిన షాహుల్ హమీద్ 2003 జూన్ 9న తన హాలీడేస్ పూర్తి చేసుకుని స్వస్థలమైన చెన్నై నుంచి సౌదీకి బయల్దేరాడు. అయితే, చెన్నైకి చెందిన కొందరు తెలిసిన వాళ్లు హమీద్‌ను సౌదీలో ఉండే తమవారి కోసం ఓ పార్శిల్ తీసుకెళ్లాల్సిందిగా చెప్పారు. వారు ఇచ్చిన పార్శిల్‌ను హమీద్ తన లగేజీలో పెట్టుకున్నాడు. చెన్నై నుంచి బహ్రెయిన్ మీదుగా సౌదీ వెళ్లేందుకు విమానం ఎక్కాడు. ఇక విమానం బహ్రెయిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హమీద్ లగేజీలో ఉన్న పార్శిల్‌లో మత్తు పదార్థాలు బయటపడ్డాయి. దాంతో విమానాశ్రయ అధికారులు హమీద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ పార్శిల్ తనది కాదని, తెలిసిన వారు ఇస్తే తీసుకొచ్చానని చెప్పినా లాభం లేకపోయింది. ఈ కేసులో బహ్రెయిన్ న్యాయస్థానం హమీద్‌కు యావజ్జీవకారాగార శిక్ష విధించింది. దీంతో గత 19 ఏళ్లుగా అతడు బహ్రెయిన్ జైలులోనే మగ్గుతున్నాడు. 


ఈ క్రమంలో హమీద్‌ను తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో బహ్రెయిన్ అధికారులు మానవత దృక్పథంతో అతడిని విడుదల చేసేందుకు అంగీకరించారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన హమీద్ బుధవారం స్వదేశానికి పయనమయ్యాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హమీద్.. తనపట్ల కనీకరం చూపించిన కింగ్‌డమ్ పాలకులు, అధికారులతో పాటు తన విడుదల కోసం తీవ్రంగా శ్రమించిన భారత ఎంబసీ, సామాజిక కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇది తనకు చాలా బిగ్ రిలీఫ్ అని పేర్కొన్న హమీద్.. ఈ మధురమైన క్షణాల కోసం స్వదేశంలో ఉన్న తన భార్య షకీనా షాహుల్ హమీద్, ఇద్దరు కుమారులు, కూతురు, తల్లి గత 19 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపాడు. ఈ 19 ఏళ్లలో తన జీవితం, కుటుంబంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, తన తండ్రిని కూడా కోల్పోయినట్లు వాపోయాడు. విదేశాలకు వెళ్లే తనలాంటి వారికి తన జీవితంలో జరిగిన ఈ చేదు ఘటన ఓ గుణపాఠం లాంటిదని ఈ సందర్భంగా షాహుల్ హమీద్ చెప్పుకొచ్చాడు. 

Updated Date - 2022-02-11T17:05:39+05:30 IST