కూతురు మంచి మార్కులతో పాస్ అయిందని తండ్రి సంబరం.. అంతలోనే విషాదం!
ABN , First Publish Date - 2021-08-01T16:33:56+05:30 IST
శుక్రవారం విడుదలైన సీబీఎస్ఈ గ్రేడ్-12 పరీక్షల్లో కూతురు మంచి మార్కులతో పాస్ అయిందని తోటి వారికి స్వీట్లు పంచిపెట్టి సంబర పడిన తండ్రి ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రాణాలొదిలిన విషాద ఘటన షార్జాలో చోటు చేసుకుంది.
షార్జా: శుక్రవారం విడుదలైన సీబీఎస్ఈ గ్రేడ్-12 పరీక్షల్లో కూతురు మంచి మార్కులతో పాస్ అయిందని తోటి వారికి స్వీట్లు పంచిపెట్టి సంబర పడిన తండ్రి ఆ తర్వాత కొద్దిసేపటికి ప్రాణాలొదిలిన విషాద ఘటన షార్జాలో చోటు చేసుకుంది. కేరళకు చెందిన జోస్ వర్ఘేస్(55) గత 20 ఏళ్లుగా యూఏఈలోనే ఉంటున్నాడు. చార్టర్డ్ అకౌంటెంట్ అయినా జోస్ మరికొంత మంది స్నేహితుల భాగస్వామ్యంతో షార్జాలో ఓ కంపెనీ నడిపిస్తున్నాడు. అతని భార్య, ఇద్దరు పిల్లలు కేరళలోనే ఉంటున్నారు.
భార్య కేరళలో టీచర్గా పని చేస్తోంది. ఇక శుక్రవారం విడుదలైన సీబీఎస్ఈ గ్రేడ్-12 పరీక్షల్లో కూతురు దొన్హా ఎలిజబెత్ జోస్ 96 శాతం మార్కులతో పాస్ అయింది. ఈ విషయం తెలుసుకున్న షార్జాలో ఉన్న జోస్ సంబరాలు చేసుకున్నాడు. అనంతరం అదే ఆనందంతో స్నేహితులు, తోటి వారికి స్వీట్స్ పంచి పెట్టాడు. రాత్రికి మంచి పార్టీ చేసుకుందామని కూడా మిత్రులతో చెప్పాడు.
ఈ క్రమంలో సాయంత్రం సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు చికిత్స కోసం జోస్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 7.40 గంటలకు చనిపోయాడు. కాగా, జోస్కు రక్తపోటు, మధుమేహం ఉన్నట్లు తెలిసింది. దాంతోనే గుండెపోటుకు గురై మృతిచెంది ఉంటాడని స్నేహితులు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే గానీ జోస్ మరణానికి కారణం ఏంటనేది తెలియదు. జోస్ మృతదేహాన్ని కేరళకు తరలించేందుకు స్నేహితులు ఏర్పాట్లు చేస్తున్నారు.