అప్ప‌టి వ‌ర‌కు విజిట్ వీసాల‌పై భార‌తీయులు యూఏఈ రావొద్దు !

ABN , First Publish Date - 2020-08-04T14:26:26+05:30 IST

ట్రావెల్ ప్రోటోకాల్‌పై స్పష్టత వచ్చేవరకు భారత పౌరులకు విజిట్ వీసాలపై ప్రయాణించడానికి అనుమతి లేదని యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ అన్నారు.

అప్ప‌టి వ‌ర‌కు విజిట్ వీసాల‌పై భార‌తీయులు యూఏఈ రావొద్దు !

యూఏఈ: ట్రావెల్ ప్రోటోకాల్‌పై స్పష్టత వచ్చేవరకు భారత పౌరులకు విజిట్ వీసాలపై ప్రయాణించడానికి అనుమతి లేదని యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ అన్నారు. "ఈ సమయంలో యూఏఈ ప్ర‌భుత్వం ప్రజలను సందర్శన వీసాలపై త‌మ దేశానికి రావడానికి అనుమతిస్తుందో లేదో స్పష్టంగా తెలియ‌దు. ఈ విష‌యంపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే విజిట్‌ వీసాలపై ప్రయాణించడానికి పౌరుల‌ను అనుమతించాలా? వద్దా? అని భారత ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు" అని ఆయ‌న చెప్పారు. ప్రస్తుతానికి విమానయాన సంస్థలు సైతం విజిట్ వీసాతో ప్రయాణికులను తీసుకెళ్లడం లేదని ఈ సంద‌ర్భంగా రాయబారి స్ప‌ష్టం చేశారు. 


మ‌రోవైపు జూలై 29 నుంచి భారతదేశంతో సహా మరిన్ని దేశాలకు దుబాయ్ విజిట్ వీసాలు ఇవ్వడం ప్రారంభించిందని స‌మాచారం. అయితే, ఇండియాలో ఇప్పటికీ అంత‌ర్జాతీయ విమాన ప్ర‌యాణాల‌పై ఈ నెల 31 వ‌ర‌కు ఆంక్ష‌లు ఉన్న‌ విష‌యం తెలిసిందే. దీంతో విజిట్ వీసాదారులు యూఏఈకి ఎలా వెళ్తారో స్పష్టత‌ లేదు. ఇక 'వందే భారత్ మిషన్‌'లో భాగంగా భార‌త్ నుంచి యూఏఈకి ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తున్న వీటిలో వాలిడ్ రెసిడెన్సీ వీసా ఉన్నవారిని మాత్రమే అనుమ‌తిస్తున్నారని ఆయ‌న గుర్తు చేశారు. అదేవిధంగా ఉద్యోగార్ధులు కూడా మ‌రికొంత కాలం వేచి చూడ‌టం మంచిద‌ని భార‌త రాయ‌బారి సూచించారు. విజిట్ వీసాల‌పై యూఏఈకి వ‌చ్చి క‌ష్టాలు కొనితెచ్చుకొవ‌ద్ద‌ని హిత‌వు ప‌లికారు. విజిటింగ్ వీసాల‌పై పూర్తి స్ప‌ష్ట‌త వ‌చ్చేవ‌ర‌కు భార‌త పౌరులు యూఏఈకి రాక‌పోవ‌డం మంచిద‌న్నారు.   

Updated Date - 2020-08-04T14:26:26+05:30 IST