Indian Embassy: ప్రవాసులకు అబుదాబిలోని భారత ఎంబసీ వార్నింగ్.. అప్రమత్తంగా ఉండకుంటే తీవ్రంగా నష్టపోతారంటూ..

ABN , First Publish Date - 2022-08-18T17:52:50+05:30 IST

యూఏఈ రాజధాని అబుదాబిలోని భారత రాయబార క్యార్యాలయం (Indian Embassy) అక్కడి భారత ప్రవాసులను హెచ్చరించింది.

Indian Embassy: ప్రవాసులకు అబుదాబిలోని భారత ఎంబసీ వార్నింగ్.. అప్రమత్తంగా ఉండకుంటే తీవ్రంగా నష్టపోతారంటూ..

అబుదాబి: యూఏఈ రాజధాని అబుదాబిలోని భారత రాయబార క్యార్యాలయం (Indian Embassy) అక్కడి భారత ప్రవాసులను హెచ్చరించింది. సామాజిక మాధ్యమాల ద్వారా యూఏఈ నుంచి భారత్‌కు ట్రావెల్ సర్వీసుల పేరిట వచ్చే తప్పుడు ప్రకటనలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గుడ్డిగా నమ్మి  కేటుగాళ్ల చేతిలో మోసపోవద్దని పేర్కొంది. ఈ మేరకు భారత ఎంబసీ అధికారిక ట్విటర్ పేజీ ద్వారా ప్రవాసుల కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. "అమాయకులైన భారత ప్రవాసులను కొందరు కేటుగాళ్లు యూఏఈ నుంచి ఇండియాకు ట్రావెల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి అందినకాడికి దండుకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండండి" అని ఎంబసీ ట్వీట్ చేసింది. 


ఇలాంటి తప్పుడు ప్రకటనల కోసం కేటుగాళ్లు ఏకంగా ఎంబసీ పేరుతో ("@embassy_help") ఫేక్ ఐడీల ద్వారా సందేశాలు పంపిస్తున్నట్లు ఎంబసీ తెలిపింది. ఎంబసీకి సంబంధించిన అఫీషియల్ ఈ-మెయిల్ ఐడీలు, ట్విటర్ హ్యాండిల్, ఫేస్‌బుక్ ఐడీ, టెలిఫోన్ నంబర్లు అన్ని కూడా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొంది. అందుకే రాయబార కార్యాలయం పేరిట తప్పుడు ఐడీలతో వచ్చే సందేశాలను గుడ్డిగా నమ్మొద్దని ఈ సందర్భంగా ఎంబసీ వారించింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇలాంటి సందేశాలకు స్పందించేముందు ఒకసారి ఆ ఐడీలను క్రాస్‌చెక్ చేసుకోవాలని ఎంబసీ సూచించింది. అప్పుడే కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుండా సేఫ్‌గా ఉండొచ్చని తెలిపింది. ఇక భారతీయ మిషన్స్‌కు సంబంధించి అన్ని సందేశాలు ఎప్పుడు కూడా @mea.gov.in అనే డొమైన్‌తో ముగుస్తాయనే విషయాన్ని ప్రవాసులు గుర్తుపెట్టుకోవాలని రాయబార కార్యాలయం తెలిపింది.     

Updated Date - 2022-08-18T17:52:50+05:30 IST