అమెరికాలో భారతీయ మహిళ ఆత్మహత్య.. స్పందించిన భారత రాయబార కార్యాలయం.. !
ABN , First Publish Date - 2022-08-08T01:38:29+05:30 IST
అమెరికాలో భర్త వేధింపులు తాళలేక ఓ భారతీయ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది.
ఎన్నారై డెస్క్: అమెరికాలో భర్త వేధింపులు తాళలేక ఓ భారతీయ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటనపై న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం తాజాగా స్పందించింది. బాధిత కుటుంబానికి సంఘీ భావం ప్రకటించింది. అంతేకాకుండా.. ఈ విషయంలో అమెరికా అధికారులకు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందిస్తామని పేర్కింది.
కొడుకును కనలేదంటూ భర్త చేతిలో నిత్యం వేధింపులకు గురవుతున్న మన్దీప్కౌర్(Mandeep Kaur).. ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. పెళ్లి తరువాత కోటి కలలతో భర్త వెంట వెళ్లిన ఆమెకు మగపిల్లలు కలగకపోవడంతో వేధింపుల బారిన పడింది. బాధలు భరించలేకపోయిన ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన భర్త రణ్జోత్వీర్ సింగ్ సంధూ చేతుల్లో పడిన బాధలను వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి..చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియో కారణంగా నెట్టింట్లో కలకలం రేగింది. నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ పోలీసులు.. రణ్జోత్సింగ్, అతడి కుటుంబసభ్యులపై గృహహింస, ఆత్మహత్యకు పురిగొల్పడం తదితర అభియోగాల కేసు నమోదు చేశారు. మరోవైపు.. న్యూయార్క్ సిటీ పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.