కువైట్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన

ABN , First Publish Date - 2021-01-15T00:58:28+05:30 IST

కువైట్‌లోని భారత ఎంబసీ తాజాగా ఇండియన్ ప్రవాసులకు కీలక సూచన చేసింది. మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

కువైట్‌లోని భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన

కువైట్ సిటీ: కువైట్‌లోని భారత ఎంబసీ తాజాగా ఇండియన్ ప్రవాసులకు కీలక సూచన చేసింది. మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎంబసీ అధికారుల పేరిట ఫోన్ చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ తమ దృష్టికి వస్తున్న విషయాన్ని ఎంబసీ గుర్తు చేసింది. ఈ సందర్భంగా ప్రవాసుల కోసం కీలక ప్రకటన విడుదల చేసింది. "కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎంబసీ అధికారులమంటూ కువైట్‌లోని భారతీయులకు ఫోన్ చేస్తున్నారు. అనంతరం వివిధ సర్వీసుల పేరిట అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. భారత ఎంబసీ అధికారులు ఎవరూ ఇలా ఫోన్ ద్వారా ఎంబసీ సర్వీసులకు గాను డబ్బులు కట్టాలని అడగరు. మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయమని అడుతున్నారంటే వాళ్లు కచ్చితంగా కేటుగాళ్లని అర్థం చేసుకోండి. ఎట్టిపరిస్థితిలో వారికి మీ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్, డేబిట్ కార్డ్ వివరాలు ఇవ్వకండి." అని ఎంబసీ తన  ప్రకటనలో పేర్కొంది. 


దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన సేవ కేంద్రాల ద్వారానే అవసరమైన సర్వీసులు పొందాలని ఈ సందర్భంగా ఎంబసీ అధికారులు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ http://www.indembkwt.gov.in ఉంటాయని తెలిపారు. కనుక తప్పుడు ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎంబసీ అధికారులమంటూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారిని గుడ్డిగా నమ్మి మోసపోవద్దని తెలియజేశారు.    

Updated Date - 2021-01-15T00:58:28+05:30 IST