కాన్సులర్ సర్వీసులను నిలిపివేసిన కువైట్లోని భారత ఎంబసీ!
ABN , First Publish Date - 2021-06-25T14:36:34+05:30 IST
మహమ్మారి కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్లోని భారత ఎంబసీ జూలై 1 వరకు కాన్సులర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కువైట్ సిటీ: మహమ్మారి కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కువైట్లోని భారత ఎంబసీ జూలై 1 వరకు కాన్సులర్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అత్యావసర కాన్సులర్ సర్వీసులు మాత్రం అందుబాటులో ఉంటాయని రాయబార కార్యాలయం తెలిపింది. ఎమర్జెన్సీని బట్టి ప్రవాసులకు ఈ కాన్సులర్ సేవల కోసం అపాయింట్మెంట్ ఇవ్వబడుతుందని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాగా, వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ఎంబసీ ఇలా కాన్సులర్ సర్వీసులను నిలిపివేయడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. భారత ప్రవాసులు ఎవరైనా ఎమర్జెన్సీ కాన్సులర్ సర్వీసుల కోసం cons1.kuwait@mea.gov.in మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని రాయబార కార్యాలయం పేర్కొంది. మూడు పాస్పోర్టు కేంద్రాల్లో యధావిధిగా పాస్పోర్టు సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక ఎంబసీ ఆధ్యర్యంలో జరిగే ఇతర కార్యక్రమాలు వచ్చే రెండు వారాల తర్వాత రీషెడ్యూల్ చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు.