బ్రాంప్టన్‌లో భారతీయ సమాజం తిరంగ ర్యాలీ..

ABN , First Publish Date - 2021-03-02T20:19:59+05:30 IST

కెనడాలోని భారతీయ సమాజం ఆ దేశంతో బలమైన సంబంధాలను కోరుతూ ఆదివారం బ్రాంప్టన్‌లో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించింది.

బ్రాంప్టన్‌లో భారతీయ సమాజం తిరంగ ర్యాలీ..

అంటారియో: కెనడాలోని భారతీయ సమాజం ఆ దేశంతో బలమైన సంబంధాలను కోరుతూ ఆదివారం బ్రాంప్టన్‌లో భారీ తిరంగ ర్యాలీ నిర్వహించింది. పలువురు భారతీయ ప్రవాసులు తమ వాహనాల్లో భారత జాతీయ జెండాతో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇటీవల అక్కడి భారతీయ సమాజం ఖలీస్థానీల నుంచి బెదిరింపులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ర్యాలీలో భారత ప్రవాసులు ఖలీస్థానీల విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ఖలీస్థానీల నుంచి బెదిరింపుల విషయమై భారత ప్రభుత్వం కూడా వారం రోజుల క్రితం కెనడా సర్కార్‌ను భారత ప్రవాసుల భద్రతను కాపాడాల్సిందిగా కోరింది. 


కాగా, భారత ప్రవాసులు కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు మద్దతుగా తిరంగ ర్యాలీ నిర్వహించడంతోనే ఖలీస్థానీ గ్రూపు అక్కడి భారతీయ సమాజంపై బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక భారత ప్రవాసులపై బెదిరింపుల విషయమై వెంటనే స్పందించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ).. కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. తమ పౌరుల భద్రతను నిర్ధారించాల్సిందిగా కోరింది. ఎంఈఏ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవా మాట్లాడుతూ..'ఖలీస్థానీ గ్రూపు నుంచి కెనడాలో భారతీయ సమాజం బెదిరింపులను ఎదుర్కొన్నట్లు తెలియడంతో వెంటనే ఒట్టావా, ఢిల్లీలోని కెనడియన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారికి రక్షణ కల్పించాల్సిందిగా కోరాం. అలాగే ఎవరైతే భారత ప్రవాసులు బెదిరింపులు ఎదుర్కొన్నారో వారిని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించాం' అని అన్నారు.

Updated Date - 2021-03-02T20:19:59+05:30 IST