పాకిస్థాన్కు మద్దతు.. యువీ, భజ్జీపై నెటిజన్ల ఆగ్రహం
ABN , First Publish Date - 2020-04-02T01:18:06+05:30 IST
చైనాలోని వూహన్లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచదేశాలకు ప్రమాదకారిగా మారింది. ఇప్పటికే ఈ వైరస్ సోకి వేలాది మంది ప్రాణాలు
చైనాలోని వూహన్లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచదేశాలకు ప్రమాదకారిగా మారింది. ఇప్పటికే ఈ వైరస్ సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో ప్రవేశించిన ఈ వైరస్ను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కూడా విధించింది. అయితే కరోనా వ్యాధి ప్రభావం పాకిస్థాన్పై కూడా గట్టిగా ఉంది. ఇప్పటికే పాకిస్థాన్లో 2వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది. దీంతో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ దీనిపై పోరాటం కోసం తన ట్రస్ట్ ద్వారా విరాళాలు సేకరించడం ప్రారంభించాడు.
అయితే ఈ క్రమంలో టీం ఇండియా క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ పాకిస్థాన్కి కూడా సహాయం చేయాలని తమ తోటి క్రికెటర్లు అభిమానులను కోరారు. హర్భజన్ ఈ విషయాన్ని హర్భజన్ వీడియో మెసేజ్ ద్వారా తెలిపితే.. ‘‘ఈ కష్టసమయంలో.. ఒకరిని ఒకరు కాపాడుకోవాలి’’ అంటూ యువరాజ్ ట్వీట్ చేశారు. ఇందుకు వీరిద్దరికి అఫ్రిదీ ధన్యవాదాలు కూడా చెప్పాడు. అయితే పాకిస్థాన్కు మద్దతు తెలిపినందుకు యువీ, భజ్జీలను దేశద్రోహులు అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు చేశారు.
‘‘అసలు మీకు తెలివి ఉందా?’’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ‘‘ఈ ఒక్క పోస్ట్తో మాకు మీపై ఉన్న మర్యాద మొత్తం పోయింది’’ అంటూ మరొకరు పేర్కొన్నారు.
2012-13 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్లు జరుగలేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి. 2019లో ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ చివరిసారిగా తలపడ్డాయి.