ఆస్ట్రేలియాలో భారత జట్టు షెడ్యూల్ ఇలా!
ABN , First Publish Date - 2020-10-23T09:51:30+05:30 IST
ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. దీనిని బీసీసీఐ ఆమోదించిన వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒకటి రెండు
బీసీసీఐ ఆమోదమే తరువాయి
సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు టూర్ షెడ్యూల్ దాదాపు ఖరారైంది. దీనిని బీసీసీఐ ఆమోదించిన వెంటనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది. వచ్చే నెలాఖరులో మొదలయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా మూడేసి టీ20లు, వన్డేలతోపాటు నాలుగు టెస్ట్లు ఆడనుంది. ఇక కోహ్లీసేన సిడ్నీలో అడుగుపెట్టడంతోపాటు అక్కడ స్వీయ నిర్బంధంలో ఉండేందుకు న్యూ సౌత్వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ఈమేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), న్యూసౌత్వేల్స్ రాష్ట్ర సర్కారు ఒప్పందానికి వచ్చాయి. ఐపీఎల్ నుంచి భారత్, ఆసీస్ క్రికెటర్లు నేరుగా సిడ్నీ చేరుకొని అక్కడ క్వారంటైన్లో ఉండడంతోపాటు సాధన కూడా చేయనున్నారు.
స్పాన్సర్ దొరికేనా?.: దుస్తుల స్పాన్సర్ లేకుండా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. బీసీసీఐతో గత స్పాన్సర్ నైకీ చేసుకున్న ఒప్పందం సెప్టెంబరుతో ముగిసింది. దాంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ ఆగస్టులోనే టెండర్లు ఆహ్వానించింది. బిడ్ దాఖలుకు గడువు ముగిసినా ఎవరూ బిడ్లు సమర్పించలేదు. అయితే కొత్తగా మళ్లీ బిడ్లు పిలవకూడదని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టు సమాచారం. దానికన్నా ఇప్పటికే టెండరు దరఖాస్తులు కొనుగోలు చేసిన సంస్థలతో చర్చలు జరపాలని బోర్డు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.