బోట్స్వానా కారు ప్రమాదంలో భారతీయ యువ దంపతులు మృత్యువాత!

ABN , First Publish Date - 2021-08-20T18:59:59+05:30 IST

ఆఫ్రికాలోని బోట్స్వానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ యువ దంపతులు మృత్యువాత పడ్డారు.

బోట్స్వానా కారు ప్రమాదంలో భారతీయ యువ దంపతులు మృత్యువాత!

త్రిస్సూర్: ఆఫ్రికాలోని బోట్స్వానాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ యువ దంపతులు మృత్యువాత పడ్డారు. మృతులను కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌కు చెందిన దీపక్ మీనన్(29), గాయత్రి(25)గా గుర్తించారు. కాగా, బోట్స్వానాలో దీపక్ చార్టెర్డ్ అకౌంటెంట్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటన గత ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు బోట్స్వానాలోని మారుపులలో చోటు చేసుకుంది. స్నేహితుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


స్థానిక హైవేపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న దీపక్ దంపతుల కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. గతేడాది డిసెంబర్‌లోనే దీపక్, గాయత్రి వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం ఈ ఏడాది జనవరిలో బోట్స్వానా వెళ్లారు. అక్కడికి వెళ్లిన నెలల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగిపోయింది. దీంతో మృతుల స్వస్థలమైన త్రిస్సూర్‌లోని వల్లాచిరాలో విషాదం నెలకొంది. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.       

Updated Date - 2021-08-20T18:59:59+05:30 IST