Coast Guard: 9 మంది జాలర్లను కాపాడిన కోస్ట్గార్డ్
ABN , First Publish Date - 2022-10-01T16:02:31+05:30 IST
శ్రీలంక సముద్ర జలాల్లో ఇంజిన్ పనిచేయక పడవలో చిక్కు కున్న పూంపుహార్ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది జాలర్లను భారత నావికాదళం
చెన్నై, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): శ్రీలంక సముద్ర జలాల్లో ఇంజిన్ పనిచేయక పడవలో చిక్కు కున్న పూంపుహార్ ప్రాంతానికి చెందిన తొమ్మిది మంది జాలర్లను భారత నావికాదళం కాపాడి తీరానికి చేర్చింది. మైలాడుదురై పూంపుహార్ రేవు నుంచి ఈ నెల 25న మరపడవలో 16 మంది జాలర్ల చేపలవేటకు వెళ్ళారు. కోడియక్కరైకి ఆగ్నేయంగా సముద్రంలో ఆ జాలర్లు చేపలుపడుతుండగా పడవలోని ఇంజిన్ పనిచేయక మొరాయించింది. దీంతో ఆ పడవలో ఉన్న ఏడుగురు జాలర్లు మరో నాటుపడవలో స్వస్థలానికి బయలుదేరారు. తక్కిన తొమ్మిదిమంది ఆ పడవలో కొట్టుమిట్టాడారు. పెనుగాలులకు ఆ పడవ శ్రీలంక తీరం వైపు వెళ్లడంతో ఆ దేశ నావికాదళం భారత నావికాదళానికి సమాచారం అందించింది. దీంతో భారత కోస్టుగార్డు(Indian Coast Guard) సిబ్బంది గస్తీ నౌకతో ఆ ప్రాంతానికి వెళ్ళి పడవలో ఉన్న తొమ్మిదిమంది జాలర్లను సురక్షితంగా పూంపుహార్ తీరానికి చేర్చారు. మూడు రోజులు ఇబ్బందులకు గురైన జాలర్లు ఎట్టకేలకు నావికాదళం సాయంతో స్వస్థలానికి చేరటంతో వారి కుటుంబీకులంతా సంతోషించారు.