భారత చార్టర్డ్ అకౌంటెంట్కు యూఏఈ గోల్డెన్ వీసా!
ABN , First Publish Date - 2021-06-23T14:57:45+05:30 IST
యూఏఈ రాజధాని అబుధాబిలో ఉండే భారత చార్టర్డ్ అకౌంటెంట్ ఇటీవల గోల్డెన్ వీసా పొందారు. సయ్యద్ జావీద్ షా(38) అనే భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ను 'స్పెషల్ టాలెంట్-ఆర్ట్ అండ్ సైన్స్' విభాగంలో యూఏఈ పదేళ్ల గోల్డెన్ వీసాను అందించింది.
అబుధాబి: యూఏఈ రాజధాని అబుధాబిలో ఉండే భారత చార్టర్డ్ అకౌంటెంట్ ఇటీవల గోల్డెన్ వీసా పొందారు. సయ్యద్ జావీద్ షా(38) అనే భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ను 'స్పెషల్ టాలెంట్-ఆర్ట్ అండ్ సైన్స్' విభాగంలో యూఏఈ పదేళ్ల గోల్డెన్ వీసాను అందించింది. 15 ఏళ్లుగా యూఏఈలో ఉంటున్న జావీద్ ఈ ఏడాది మే 25న ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ) నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు. వారం రోజుల తర్వాత ఆయన భార్య కూడా గోల్డెన్ వీసా పొందడం విశేషం. ఇది తనకు తన కుటుంబానికి అత్యంత ఆనందకర సమయమని ఈ సందర్భంగా జావీద్ పేర్కొన్నారు.
2006 నుంచి యూఏఈలో ఉంటున్న తాను ఇప్పటివరకు ప్రాజెక్ట్ పనుల మీద 30కి పైగా దేశాలకు వెళ్లానని, వీటిలో యూఎస్, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నట్లు తెలిపారు. కానీ, తాను మాత్రం యూఏఈలోనే సెటిల్ అయ్యానని, ఇది తనకు రెండో ఇల్లులాంటిదని చెప్పుకొచ్చారు. కష్టపడి పనిచేసే తత్వమే తనకు ఇవాళ ఈ గోల్డెన్ వీసా అందుకునే అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టిందని జావీద్ చెప్పారు. ఆయన స్వస్థలం తెలంగాణలోని ఆదిలాబాద్.