ఆఫ్ఘన్లో విడుదలైన భారత బిజినెస్మేన్
ABN , First Publish Date - 2021-09-30T01:09:26+05:30 IST
ఇటీవల కాబూల్లో అపహరణకు గురైన భారతీయ వ్యాపారి
న్యూఢిల్లీ : ఇటీవల కాబూల్లో అపహరణకు గురైన భారతీయ వ్యాపారి బన్శ్రీ లాల్ అరెండేహ్ (50) బుధవారం విడుదలైనట్లు ఇండియన్ వరల్డ్ ఫోరం (ఐడబ్ల్యూఎఫ్) ప్రెసిడెంట్ పునీత్ సింగ్ చందోక్ చెప్పారు. దాదాపు 15 రోజులపాటు జరిపిన చర్చలు సత్ఫలితాలిచ్చాయని, ఆయనను విడుదల చేశారని చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్లో హిందువులు, సిక్కుల సంక్షేమం కోసం ఐడబ్ల్యూఎఫ్ పని చేస్తోంది.
పునీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, బన్శ్రీ లాల్ అరెండేహ్ను సెప్టెంబరు 15న కాబూల్లో కిడ్నాప్ చేశారన్నారు. సుమారు 15 రోజులపాటు జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని, ఆయనను బుధవారం విడుదల చేశారని చెప్పారు. ఆయన ప్రస్తుతం తన సోదరుడు అశోక్ లాల్ వద్ద ఉన్నారని చెప్పారు.
ఈ కిడ్నాప్ సంఘటనపై దర్యాప్తునకు తాలిబన్లు సెప్టెంబరు 15న ఆదేశాలు ఇచ్చారు. అయితే దర్యాప్తు వివరాలు వెల్లడి కాలేదు. కిడ్నాపర్ల వివరాలు కూడా తెలియడం లేదు. ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది.
బన్శ్రీ లాల్ కాబూల్లో అతి పెద్ద ఫార్మాస్యుటికల్ ట్రేడర్లలో ఒకరు. ఆఫ్ఘనిస్థాన్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ ఆయన తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలో నివసిస్తున్నారు.