అమెరికన్ రైఫిల్స్ కొనుగోలుకు రెండోసారి ఆర్డర్ : భారత సైన్యం నిర్ణయం

ABN , First Publish Date - 2020-07-12T23:00:00+05:30 IST

చైనా, పాకిస్థాన్ దుస్తంత్రాలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత్ మరింత

అమెరికన్ రైఫిల్స్ కొనుగోలుకు రెండోసారి ఆర్డర్ : భారత సైన్యం నిర్ణయం

న్యూఢిల్లీ : చైనా, పాకిస్థాన్ దుస్తంత్రాలను దీటుగా తిప్పికొట్టేందుకు భారత్ మరింత గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది. అత్యంత వేగంగా ఆయుధాలను సేకరించేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అత్యవసరంగా ఆయుధాలను కొనుగోలు చేయడం కోసం రక్షణ శాఖకు ప్రత్యేకంగా ఆర్థిక అధికారాలను కల్పించింది. 


చైనాతో ఘర్షణ నేపథ్యంలో ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఇప్పటికే 72,000 సిగ్ సాయెర్ అసాల్ట్ రైఫిల్స్ అమెరికా నుంచి సేకరించారు. వీటిని నార్తర్న్ కమాండ్, ఇతర ఆపరేషనల్ ఏరియాస్‌కు పంపించారు. తాజాగా మరొక 72,000 సిగ్ 716 అసాల్ట్ రైఫిల్స్‌ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వబోతున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 


ప్రస్తుతం మన దేశ సైనికులు చిన్న తరహా ఆయుధాలను వాడుతున్నారు. వీటిని మన దేశంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ తయారు చేసింది. దాదాపు 1.5 లక్షల దిగుమతి చేసుకున్న రైఫిల్స్‌ను కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్, నియంత్రణ రేఖ వెంబడి కార్యకలాపాల్లో వినియోగించాలని రక్షణ శాఖ నిర్ణయించింది. మిగిలిన దళాలకు ఏకే-203 రైఫిల్స్‌ను అందజేయాలని నిర్ణయించింది. ఈ ఏకే-203 రైఫిల్స్‌ను భారత్-రష్యా సంయుక్తంగా అమేథీలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేస్తాయి. ఇరువైపులా విధానపరమైన సమస్యలు తలెత్తడం వల్ల ఈ రైఫిల్స్ తయారీ ప్రారంభం కాలేదు. 


భారత సైన్యం చిన్న తరహా ఆయుధాల వ్యవస్థను మార్చాలని చాలా కాలం నుంచి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నాయి. 


ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి 16,000 లైట్ మెషిన్ గన్స్‌ తెప్పించేందుకు రక్షణ మంత్రిత్వ ప్రయత్నాలు ప్రారంభించింది.


Updated Date - 2020-07-12T23:00:00+05:30 IST