కశ్మీరులో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైన్యం ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2021-04-16T21:00:26+05:30 IST

కశ్మీరీలకు చేరువయ్యేందుకు భారత సైన్యం కొన్ని చర్యలను అమలు

కశ్మీరులో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సైన్యం ఏం చేసిందంటే...

శ్రీనగర్ : కశ్మీరీలకు చేరువయ్యేందుకు భారత సైన్యం కొన్ని చర్యలను అమలు చేస్తోంది. స్థానికులతో స్నేహ సంబంధాలను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా సైనిక వాహనాలపై జెండాల రంగును మార్చింది. ఎరుపు రంగు జెండాలకు బదులుగా నీలం రంగు జెండాలను వాడుతోంది. అదేవిధంగా కంటోన్మెంట్ గోడలపై స్థానిక ప్రముఖుల చిత్రాలను పెయింటింగ్ వేయించాలని ప్రతిపాదించింది. ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలని సైనికులను ఆదేశించింది. 


లెఫ్టినెంట్ కల్నల్ క్యూ ఖాన్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కశ్మీరు లోయలోనూ, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే సైనిక వాహనాలపై జెండాల రంగును మార్చినట్లు తెలిపారు. ఎరుపు రంగు జెండాలకు బదులుగా నీలం రంగు జెండాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 


వివిధ రంగాల్లో ఘనత సాధించిన యువ కశ్మీరీల బొమ్మలను కంటోన్మెంట్ గోడలపై చిత్రించాలని నిర్ణయించినట్లు చెప్పారు. లాఠీలను ధరించే సైనికులు వాహనాలను ఆపేటపుడు ఈలను మాత్రమే ఉపయోగించాలని ఆదేశించినట్లు తెలిపారు. కశ్మీరులోని అందమైన ప్రదేశాలకు సంబంధించిన సందేశాలు, బొమ్మలను వాహనాలపై చిత్రించాలని ప్రతిపాదించినట్లు చెప్పారు. ప్రజలతో మాట్లాడేటపుడు చాలా సౌమ్యంగా, మర్యాదగా మాట్లాడాలని సైనికులను కోరినట్లు చెప్పారు. 


Updated Date - 2021-04-16T21:00:26+05:30 IST