మరో భారతీయుడికి బైడెన్ బృందంలో కీలక బాధ్యతలు!
ABN , First Publish Date - 2021-03-02T22:54:43+05:30 IST
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి తాజాగా కీలక బాధ్యతలు దక్కాయి.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన బృందంలో మరో భారత సంతతి వ్యక్తికి తాజాగా కీలక బాధ్యతలు దక్కాయి. బైడెన్ ఎన్నికల ప్రచారం, ప్రమాణస్వీకారోత్సవంలో కీలకంగా వ్యవహారించిన భారతీయ అమెరికన్ మాజు వర్గీస్.. అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్, వైట్హౌస్ మిలిటరీ ఆఫీస్ డైరెక్టర్గా నియమితులయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ ప్రచార కమిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేసిన మాజు.. ఆ తర్వాత ప్రమాణస్వీకారం కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వ్యవహారించారు. ఇక తనకు దక్కిన ఈ బాధ్యతల పట్ల మాజు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్ష భవనం తనకు కేటాయించిన బాధ్యతలకు సంబంధించిన ప్రకటనను ఆయన ట్వీట్ చేశారు. కాగా, మాజు అమెరికాలోనే పుట్టారు. అతని తల్లిదండ్రులు కేరళ నుంచి యూఎస్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.