‘గుంజన్ సక్సేనా’ సినిమాపై భారత వాయు సేన అభ్యంతరం

ABN , First Publish Date - 2020-08-13T00:29:03+05:30 IST

‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ సినిమాపై భారత వాయు సేన (ఐఏఎఫ్) అభ్యంతరం

‘గుంజన్ సక్సేనా’ సినిమాపై భారత వాయు సేన అభ్యంతరం

న్యూఢిల్లీ : ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ సినిమాపై భారత వాయు సేన (ఐఏఎఫ్) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఐఏఎఫ్‌పై అనుచితమైన వ్యతిరేకాత్మక భావన కలిగేవిధంగా సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ)కి ఫిర్యాదు చేసింది. ఈ సినిమాను విడుదల చేస్తున్న నెట్‌ఫ్లిక్స్‌కు, దీనిని నిర్మించిన ధర్మ ప్రొడక్షన్స్‌కు కూడా ఫిర్యాదు చేసింది. 


తెరపై ‘గుంజన్ సక్సేనా’ ఘనతను గొప్పగా చూపించాలనే తాపత్రయంతో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరించారని ఐఏఎఫ్ ఆరోపించింది. ఐఏఎఫ్‌లో లేనటువంటి, సరైనది కానటువంటి పని సంస్కృతి ఉన్నట్లు చూపించారని, మరీ ముఖ్యంగా మహిళల విషయంలో పని సంస్కృతి గురించి అభ్యంతరకరంగా చూపించారని తెలిపింది. ఐఏఎఫ్ స్త్రీ, పురుషులను సమానంగా గౌరవిస్తుందని స్పష్టం చేసింది. 


కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న భారత వాయు సేనకు చెందిన తొలి మహిళా పైలట్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు ధర్మ ప్రొడక్షన్స్  ప్రకటించిన సంగతి తెలిసిందే.


సక్సేనా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికులను కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. ఆమె ప్రదర్శించిన వీరత్వానికి గుర్తుగా భారత ప్రభుత్వం శౌర్య వీర్ పురస్కారం ప్రదానం చేసింది. 


Updated Date - 2020-08-13T00:29:03+05:30 IST