పరామర్శకు తీరిక లేదు.. పార్టీకి మాత్రం రెడీ
ABN , First Publish Date - 2022-09-25T09:21:26+05:30 IST
భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 టిక్కెట్ల కోసం జింఖానాలో గంటల కొద్ది నిలబడి తొక్కిసలాటలో దారుణంగా గాయపడిన ఏడుగురు బాధితులను కనీసం ఆస్పత్రికెళ్లి.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): భారత్-ఆస్ట్రేలియా మూడో టీ20 టిక్కెట్ల కోసం జింఖానాలో గంటల కొద్ది నిలబడి తొక్కిసలాటలో దారుణంగా గాయపడిన ఏడుగురు బాధితులను కనీసం ఆస్పత్రికెళ్లి పరామర్శించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రతినిధులకు తీరిక లేదు. కానీ, శనివారం రాత్రి నగరంలోని ఒక విలాసవంతమైన హోటల్లో లక్షల్లో బిల్లులు చెల్లించి పార్టీలు చేసుకోవడానికి మాత్రం సమయం ఉంది. ప్రజాధనంతో పోగేసుకున్న హెచ్సీఏ నిధులతో అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ క్లబ్ సెక్రటరీలు, తన అనుచర గణానికి పెద్ద పార్టీనే ఇచ్చాడు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా తననే అధ్యక్షుడిగా మరోసారి గెలిపించాలని ఈ పార్టీలో అతడు క్లబ్ సెక్రటరీలందరిని కోరినట్టు సమాచారం. ఒక పక్క మ్యాచ్ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు.. అయినా హెచ్సీఏ ప్రతినిధులు పార్టీలో మద్యం సేవిస్తూ వేడుక చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.