ఏవీ...స్వాగత ఏర్పాట్లు?
ABN , First Publish Date - 2022-09-25T09:22:45+05:30 IST
భారత్-ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నాయి.
శంషాబాద్ (రూరల్): భారత్-ఆస్ట్రేలియా జట్లు శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్నాయి. టీమిండియా శంషాబాద్ విమానాశ్రయం లో దిగుతుందని తెలుసుకున్న అభిమానులు అక్కడికి పెద్ద సంఖ్య చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి భారత క్రికెటర్లు బయటకు రాగానే అభిమానులు హర్షధ్వానులతో స్వాగతం పలికారు. అభిమానుల కోలాహలాన్ని చూసి పులకించిన కొందరు క్రికెటర్లు ఆ దృశ్యాలను వీడియో తీసుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి భారత జట్టుకు పార్క్ హయత్లో, ఆసీస్ జట్టుకు తాజ్కృష్ణలో బస ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ చేరేసరికి సాయంత్రం కావడంతో క్రికెటర్లు హోటల్కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు స్టీవ్ స్మిత్, మ్యాక్స్వెల్, డేవిడ్తో పాటు మరికొందరు టీమ్ సభ్యులు కొద్దిసేపు జీవీకే మాల్లో షాపింగ్ చేశారు. ఇక, టీమిండియా ఎప్పుడు హైదరాబాద్కు విచ్చేసిన హెచ్సీఏ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికేది. అయితే, హెచ్సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్ హోటల్లో జరిగే పార్టీ నిర్వహణలో హడావుడిగా ఉండి స్వాగత ఏర్పాట్లు చేయడం మర్చిపోయాడని పలువురు క్లబ్ సెక్రటరీలు విమర్శిస్తున్నారు.