Zimbabwe vs India: ఓపెనర్లే బాదేశారు.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం

ABN , First Publish Date - 2022-08-19T00:22:26+05:30 IST

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం

Zimbabwe vs India: ఓపెనర్లే బాదేశారు.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం

హరారే: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించి ఖాతా తెరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించి శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసిన భారత్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. ఒక్క వికెట్ కూడా చేజార్చుకోకుండానే 30.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది.


ఓపెనర్లు శిఖర్ ధవన్, శుభమన్‌ గిల్ ఇద్దరూ జింబాబ్వే బౌలర్లను చితక్కొట్టేశారు. ఎడాపెడా షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ధవన్ 113 బంతుల్లో 9 ఫోర్లతో 81 పరుగులు చేయగా, గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్‌తో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. జింబాబ్వే జట్టులో 8 మంది బౌలింగ్ చేసినప్పటికీ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. 


అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేకు భారత బౌలర్లు తమ బంతుల పదును ఏపాటిదో రుచి చూపించారు. వరుస పెట్టి వికెట్లు తీస్తూ ప్రత్యర్థి బ్యాటింగ్‌ను ఛిన్నాభిన్నం చేశారు. వీరి దెబ్బకు టాపార్డర్ కుప్పకూలింది. అయితే, కెప్టెన్ రేగిస్ చకబ్వా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 51 బంతుల్లో నాలుగు ఫోర్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


చివర్లో బ్రాడ్ ఎవాన్స్ (33), ఎంగర్వా 34 పరుగులు చేయడంతో జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు తీసుకోగా, సిరాజ్‌కు ఓ వికెట్ దక్కింది. భారత్-జింబాబ్వే జట్ల మధ్య రెండో వన్డే ఇదే స్టేడియంలో ఈ నెల 20న జరుగుతుంది.

Updated Date - 2022-08-19T00:22:26+05:30 IST