గ్లోబల్ వార్మింగ్‌తో భారత్‌కు తీవ్ర నష్టం!

ABN , First Publish Date - 2021-12-15T02:10:40+05:30 IST

గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉపాధి నష్టం తీవ్రంగా జరుగుతుందని

గ్లోబల్ వార్మింగ్‌తో భారత్‌కు తీవ్ర నష్టం!

న్యూఢిల్లీ : గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉపాధి నష్టం తీవ్రంగా జరుగుతుందని, ముఖ్యంగా భారత దేశం, చైనా, పాకిస్థాన్, ఇండోనేషియా వంటి దేశాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని ‘నేచర్’ మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచ ఉష్ణోగ్రతల్లో అదనంగా పెరిగే ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రతకు చాలా చాలా ఎక్కువ మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని తెలిపింది. రోజులో చల్లదనం ఉండే సమయంలోనే పని చేయవలసి రావడం వల్ల ఫలితాలు తగ్గుతాయని పేర్కొంది. 


అధిక వేడి, ఉష్ణోగ్రతలకు గురికావడం వల్ల సెంట్రల్ అమెరికా, శ్రీలంక, భారత దేశం, ఈజిప్టు, తదితర ప్రాంతాల్లో యువ కార్మికులు, ఆరోగ్యంగా ఉండే కార్మికులు కూడా తీవ్రమైన మూత్ర పిండాల వ్యాధులకు గురవుతారని తెలిపింది. మానవులు తట్టుకోగలిగే వేడి, తేమ పరిస్థితులకు జీవ సంబంధ పరిమితులు ఉంటాయని పేర్కొంది. కార్మికులు వేడి, తేమ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుండటం వల్ల ప్రపంచం సంవత్సరానికి 280 నుంచి 311 బిలియన్ డాలర్లు నష్టపోతున్నట్లు తెలిపింది. ప్రపంచం ఇప్పటి కన్నా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా వేడెక్కితే ఈ నష్టాలు 1.6 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతాయని పేర్కొంది. 


వాతావరణ మార్పులకు తగినట్లుగా భారీ పనులను రోజులో చల్లదనం ఉండే సమయంలో చేసే విధంగా మార్చడం వల్ల కలిగే ఫలితాలపై జరిగిన తొలి అధ్యయనం ఇదేనని ఈ నివేదిక పేర్కొంది.


Updated Date - 2021-12-15T02:10:40+05:30 IST