వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డ్..!

ABN , First Publish Date - 2021-06-21T23:26:07+05:30 IST

సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభంలోనే మునుపెన్నడూ లేని స్థాయిలో దేశంలో టీకాల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 69 లక్షల పైచిలుకు టీకాలు పంపిణీ అయ్యాయని కేంద్రం తాజాగా ప్రకటించింది.

వ్యాక్సినేషన్‌లో భారత్ సరికొత్త రికార్డ్..!

న్యూఢిల్లీ: సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభంలోనే మునుపెన్నడూ లేని స్థాయిలో దేశంలో టీకాల పంపిణీ జరిగింది. గత 24 గంటల్లో ఏకంగా 69 లక్షల పైచిలుకు టీకా డోసులు పంపిణీ చేశామని కేంద్రం తాజాగా ప్రకటించింది. జూన్ 21 నుంచీ దేశంలో సార్వత్రిక టీకా కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక సవరించిన టీకా విధానంలో భాగంగా దేశంలో వినియోగమయ్యే టీకాల్లో 75 శాతం కేంద్రమే సేకరిస్తూ, రాష్ట్రాల వాటాను ఉచితంగా సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన 25 శాతాన్ని ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా టీకా తయారీ సంస్థల నుంచి కొనుగోలు చేయవచ్చు. కాగా.. ఏప్రిల్ నెలలో చివరి సారిగా ఈ స్థాయిలో టీకా పంపిణీ జరిగింది. ఏప్రిల్ నెల 2న దేశ వ్యాప్తంగా 42,65,157 డోసుల పంపిణీ జరిగింది. ఇక లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తున్న అనేక రాష్ట్రాలు రోజువారీ టీకా పంపిణీ లక్ష్యాలను క్రమంగా పెంచుతున్నాయి. మంగళవారం నాడు రాష్ట్రంలో రెండు లక్షల టీకా డోసులను వేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత తక్కువగా టీకాలు వేస్తున్న రాష్ట్రం అసోం కూడా టీకా కార్యక్రమం వేగాన్ని పెంచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో రోజుకు 3 లక్షల టీకా డోసులు వేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. 

Updated Date - 2021-06-21T23:26:07+05:30 IST