భారత్, యూఏఈ మధ్య ట్రావెల్ కారిడార్ గడువు పెంపు
ABN , First Publish Date - 2020-08-05T17:00:38+05:30 IST
భారత్, యూఏఈ మధ్య తాత్కాలిక ట్రావెల్ కారిడార్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు భారత రాయబారి పవన్ కపూర్ వెల్లడించారు.
యూఏఈ: భారత్, యూఏఈ మధ్య తాత్కాలిక ట్రావెల్ కారిడార్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు భారత రాయబారి పవన్ కపూర్ వెల్లడించారు. భారత్ నుంచి యూఏఈ వెళ్లాలనుకునే రెసిడెన్సీ వీసాదారులు ఇంకా భారీ సంఖ్యలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇంతకుముందు ఈ గడువును ఇరు దేశాలు జూలై 12 నుంచి 26 వరకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక గత నెలలో రెండు వారాలు నడిపిన ప్రత్యేక విమాన సర్వీసుల ద్వారా 23వేల నుంచి 25వేల మంది వరకు రెసిడెన్సీ వీసాదారులు ఇండియా నుంచి యూఏఈ తరలివెళ్లారని భారత రాయబారి పేర్కొన్నారు.
ఇంకా భారత్ నుంచి యూఏఈ వెళ్లే వారి సంఖ్యపై స్పష్టత లేదని చెప్పిన ఆయన... యూఏఈ అధికారవర్గాల సమాచారం ప్రకారం సుమారు 25వేల నుంచి 30వేల మంది రెసిడెన్సీ వీసాదారులు ఆ దేశం వెళ్లేందుకు అనుమతి పొందినట్లు తెలిపారు. అందుకే ఆగస్టు 31వ తేదీ వరకు దాదాపు 600 నుంచి 700 వరకు ప్రత్యేక విమాన సర్వీసులు నడపనున్నట్లు దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ గడువు తర్వాత కూడా యూఏఈ వెళ్లేవారి సంఖ్య పెరిగితే విమాన సర్వీసులను కూడా పెంచే యోచనలో ఉన్నామని పవన్ కపూర్ స్పష్టం చేశారు.