భారత్-యూఏఈ సంబంధాలు మరింత బలోపేతం : పీయూష్ గోయల్
ABN , First Publish Date - 2021-09-30T00:28:17+05:30 IST
భారత్-యూఏఈ సంబంధాలు దుబాయ్ ఎక్స్పోతో మరింత
న్యూఢిల్లీ : భారత్-యూఏఈ సంబంధాలు దుబాయ్ ఎక్స్పోతో మరింత బలపడనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆయన బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, దుబాయ్ ఎక్స్పో చాలా ముఖ్యమైన కార్యక్రమమని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రౌన్ ప్రిన్స్ మధ్య సత్సంబంధాలు ఉండటం వల్ల భారత దేశానికి యూఏఈ చాలా ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సీనియర్ మంత్రులతో భారత దేశానికి చెందిన అత్యున్నత స్థాయి టాస్క్ఫోర్స్ సమావేశమవుతుందని తెలిపారు. దీంతో భారత్-యూఏఈ మధ్య సంబంధాలు, మరీ ముఖ్యంగా ఎగుమతులు పెరుగుతాయన్నారు.
దుబాయ్ ఎక్స్పో గత ఏడాది జరగవలసింది. కానీ కోవిడ్-19 మహమ్మారి వల్ల వాయిదా పడింది. ఇది శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత జరుగుతున్న అతి పెద్ద కార్యక్రమాల్లో ఇది ప్రపంచంలో రెండోది. మొదటిది టోక్యో ఒలింపిక్స్. దుబాయ్ ఎక్స్పోను సందర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది వస్తారు.