బహ్రెయిన్‌కు భారత్ థ్యాంక్స్..!

ABN , First Publish Date - 2020-11-25T21:07:41+05:30 IST

మహమ్మారి కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పట్ల బహ్రెయిన్ చూపిన ప్రత్యేక శ్రద్ధకు భారతదేశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.

బహ్రెయిన్‌కు భారత్ థ్యాంక్స్..!

మనామా: మహమ్మారి కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రవాస భారతీయుల పట్ల బహ్రెయిన్ చూపిన ప్రత్యేక శ్రద్ధకు భారతదేశం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. బహ్రెయిన్‌ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖమంత్రి అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ క్రిసిస్‌లో భారతీయుల పట్ల బహ్రెయిన్ చూపిన ప్రత్యేక శ్రద్ధకు జయశంకర్ థ్యాంక్స్ చెప్పారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగు... ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యల పరిష్కారం తదితర విషయాలపై చర్చలు జరిగినట్లు మంత్రి తెలిపారు. అలాగే నవంబర్ 11న మరణించిన బహ్రెయిన్ ప్రధాని షేక్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా మృతికి జయశంకర్ సంతాపం ప్రకటించారు. 


భారతీయుల తరఫున బహ్రెయిన్ ప్రజలు, అధికారులకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ బహ్రెయిన్‌తో పాటు యూఏఈ, సీషెల్స్ దేశాల్లో కూడా పర్యటించనున్నారు. ఇక బహ్రెయిన్‌లోని భారత ఎంబసీ అధికారిక వెబ్‌సైట్ డేటా ప్రకారం ఆ దేశం మొత్తం జనాభా 14 లక్షల్లో సుమారు 3.50 లక్షల మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం.         



Updated Date - 2020-11-25T21:07:41+05:30 IST