ఈ ఫార్మాట్‌లోనైనా..

ABN , First Publish Date - 2020-12-04T09:22:44+05:30 IST

జట్టులో కూర్పు సరిగాలేకవన్డే సిరీ్‌సను కోల్పోయిన టీమిండియా.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం బలంగానే కనిపిస్తోంది. ఏకంగా ముగ్గురు ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిరీ్‌సను వదులుకోరాదనే ఆలోచనతో ఉన్న కోహ్లీ సేన నేడు (శుక్రవారం) ఆసీ్‌సతో తొలి మ్యాచ్‌ ఆడనుంది...

ఈ ఫార్మాట్‌లోనైనా..

  • టీ20 సిరీస్‌ లక్ష్యంగా భారత్‌
  • ఆసీ్‌సతో నేడు తొలి మ్యాచ్‌
  • మధ్యాహ్నం 1.40 గం. నుంచి సోనీ సిక్స్‌లో..


వన్డే సిరీ్‌సను 1-2తో కోల్పోయిన టీమిండియా ఇక ధనాధన్‌ పోరుపై దృష్టి పెట్టింది. యువ ఆటగాళ్ల చేరికతో పాటు ఆల్‌రౌండర్ల అండతో కోహ్లీ సేన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. అందుకే తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చూపాలనుకుంటోంది. చివరి వన్డేను గెలిచిన ఉత్సాహంతో భారత జట్టు బరిలోకి దిగబోతుండగా.. అటు ఆసీస్‌ మాత్రం ఈ సిరీ్‌సను కూడా వశం చేసుకోవాలన్న కసితో కనిపిస్తోంది. 



కాన్‌బెర్రా: జట్టులో కూర్పు సరిగాలేకవన్డే సిరీ్‌సను కోల్పోయిన టీమిండియా.. టీ20 ఫార్మాట్‌లో మాత్రం బలంగానే కనిపిస్తోంది. ఏకంగా ముగ్గురు ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిరీ్‌సను వదులుకోరాదనే ఆలోచనతో ఉన్న కోహ్లీ సేన నేడు (శుక్రవారం) ఆసీ్‌సతో తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఇందుకు మనూకా ఓవల్‌ మైదానం వేదిక కానుంది. ఇదే గ్రౌండ్‌లో ఆసీ్‌సకు తొలి ఓటమి రుచి చూపించిన భారత్‌ ఆ ఫలితం పునరావృతం చేయాలనుకుంటోంది. దీనికి తోడు భారత్‌ తమ చివరి టీ20 సిరీ్‌సలో కివీ్‌సను 5-0తో వైట్‌వాష్‌ చేసింది. అయితే గతేడాది ఫిబ్రవరిలో ఆసీ్‌సతో ఆడిన సిరీ్‌సను 0-2తో ఓడిపోయింది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 20 మ్యాచ్‌లు జరిగితే భారత్‌ 11-8తో ఆధిక్యంలో ఉంది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం తమ జట్ల బలాబలాలపై కూడా అంచనాకు రావచ్చనే ఆలోచనలో రెండు జట్లూ ఉన్నాయి. 


మార్పులతో బరిలోకి..: వన్డే సిరీ్‌సలో భారత జట్టు ఆరో బౌలర్‌ లోటుతో ఇబ్బంది పడింది. కానీ ఈ ఫార్మాట్‌లో వాషింగ్టన్‌ సుందర్‌ చేరికతో ఆ సమస్య తీరనుంది. అలాగే తనతో పాటు జడేజా, పాండ్యా రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. పేసర్లు బుమ్రా, దీపక్‌ చాహర్‌, నటరాజన్‌లతో సమతూకం కనిపిస్తోంది. ఐపీఎల్‌లో సుందర్‌ను పవర్‌ప్లే, మధ్య ఓవర్లలో కోహ్లీ సమర్థంగా వినియోగించుకున్నాడు. లెగ్‌ స్పిన్నర్‌ చాహల్‌ తన లయను అందుకోవాలనుకుంటున్నాడు. ఇక ఓపెనింగ్‌లో ధవన్‌కు తోడుగా రాహుల్‌ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో రాహుల్‌ తడాఖా చూపిస్తూ ఆరెంజ్‌ క్యాప్‌ సాధించిన విషయం తెలిసిందే. అలాగే మయాంక్‌, శాంసన్‌ కూడా ఈ స్థానం కోసం రిజర్వ్‌లో ఉంటారు. అయితే ఎవరు తుది జట్టులో ఉన్నా పవర్‌ప్లే ఓవర్లను సాధ్యమైనంతగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కోహ్లీ, అయ్యర్‌ మూడు, నాలుగు స్థానాల్లో రానున్నారు. అయితే స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌ను కోరుకుంటే సుందర్‌ స్థానంలో మనీశ్‌ పాండేకు చాన్స్‌ దక్కినా ఆశ్చర్యం లేదు. హార్దిక్‌, జడేజా కూడా బ్యాట్లు ఝుళిపిస్తుండడంతో భారత్‌ భారీ స్కోరుపై ఆశలు పెట్టుకుంది. 


గాయాల సమస్య: వన్డే, టీ20ల కోసం ఆస్ట్రేలియా ఒకే జట్టును ప్రకటించింది. అయితే వార్నర్‌ గాయంతో.. పేసర్‌ కమిన్స్‌ విశ్రాంతి కారణంగా ఈ సిరీ్‌సకు అందుబాటులో లేరు. ఇక ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ మ్యాచ్‌ ఫిట్‌నె్‌సపై కూడా స్పష్టత లేదు. కెప్టెన్‌ ఫించ్‌కు జతగా మాథ్యూ వేడ్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో సరిగా రాణించలేకపోయిన స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఇప్పుడు భీకర ఫామ్‌లో ఉండడం ఆసీ్‌సకు సానుకూలాంశం. ఈ జోడీని త్వరగా కట్టడి చేయకుంటే భారత్‌కు ప్రమాదకరమే. బౌలింగ్‌లో స్పిన్నర్‌ జంపా, అగర్‌, హాజెల్‌వుడ్‌ ఇబ్బందిపెట్టనున్నారు.


జట్లు (అంచనా)

భారత్‌: ధవన్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌, మనీష్‌/వాషింగ్టన్‌ సుందర్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, దీపక్‌ చాహర్‌, షమి/నటరాజన్‌, బుమ్రా, చాహల్‌/కుల్దీప్‌.

ఆసీస్‌: ఫించ్‌ (కెప్టెన్‌), వేడ్‌, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, హెన్రిక్స్‌, క్యారీ, అగర్‌, అబాట్‌, ఆండ్రూ టై/స్టార్క్‌, జంపా, హాజెల్‌వుడ్‌.


పిచ్‌

బిగ్‌బాష్‌ లీగ్‌లో ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యాయి. అలాగే ఇక్కడ జరిగిన ఏకైక టీ20లో పాక్‌పై 151 పరుగులను ఆసీస్‌ సునాయాసంగా ఛేదించింది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.


Updated Date - 2020-12-04T09:22:44+05:30 IST