పారాలింపిక్స్‌లో భారత్ నయా చరిత!

ABN , First Publish Date - 2021-09-05T21:19:45+05:30 IST

పారాలింపిక్స్ చరిత్రలో భారత అథ్లెట్లు సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మెరిశారు. టోక్యో పారాలింపిక్స్‌లో

పారాలింపిక్స్‌లో భారత్ నయా చరిత!

టోక్యో: పారాలింపిక్స్ చరిత్రలో భారత అథ్లెట్లు సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మెరిశారు. టోక్యో పారాలింపిక్స్‌లో ఏకంగా 19 పతకాలు సాధించి విశ్వ వినువీధిలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఒక్క ఎడిషన్‌లో ఇన్ని పతకాలు సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి. మొత్తం పతకాల్లో 5 పసిడి, 8 రజతం, 6 కాంస్య పతకాలున్నాయి. ఫలితంగా పతకాల పట్టికలో భారత్ టాప్-25లో చోటు సంపాదించింది.


2018 సమ్మర్ యూత్ ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన 13 పతకాల రికార్డు తాజాగా టోక్యో పారాలింపిక్స్‌లో చెదిరిపోయింది. అంతకుముందు జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ 7 పతకాలు సాధించింది. ఇది కూడా ఓ రికార్డే. 1968 నుంచి 2016 మధ్య జరిగిన పారాలింపిక్స్‌లో భారత్ గరిష్టంగా 12 పతకాలు మాత్రమే సాధించింది. ఈసారి భారత అథ్లెట్లు పోటీ పడి మరీ పతకాలు కొల్లగొట్టారు. ప్రస్తుతం భారత్ 19 పతకాలను సొంతం చేసుకోగా, రియో ఒలింపిక్స్‌లో 19 మంది అథ్లెట్లు పాల్గొని నాలుగు పతకాలు సాధించారు. ఈసారి టోక్యోలో 54 మంది అథ్లెట్లు పాల్గొని అదరగొట్టారు. 


టేబుల్ టెన్నిస్‌లో భవీనాబెన్ పటేల్ పతకం సాధించి పతకాల ఖాతా తెరవగా చివరి రోజైన నేడు కృష్ణా నాగర్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించి అద్భుతమైన ముగింపు ఇచ్చాడు. అంతకుముందు ఐఏఎస్ అధికారి సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ ఎస్ఎల్4 కేటగిరీలో రజతం సాధించాడు. ఇక, షూటింగులో అవని లేఖర పసిడి పతకం, కాంస్య పతకం సాధించింది. పారాలింపిక్స్ ముగింపు వేడుకల్లో నేడు అవని భారత పతకాన్ని చేబూని ముందుకు సాగనుంది. కాగా, అవని పారాలింపిక్స్, లేదంటే ఒలింపిక్స్ చరిత్రలోనే స్వర్ణం గెలిచిన ఇండియన్‌గా రికార్డులకెక్కింది.  

Updated Date - 2021-09-05T21:19:45+05:30 IST