వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 60 లక్షల మంది ప్రవాసులు

ABN , First Publish Date - 2021-03-03T21:15:59+05:30 IST

కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) చేపట్టిన విషయం తెలిసిందే.

వందే భారత్ మిషన్: స్వదేశానికి చేరుకున్న 60 లక్షల మంది ప్రవాసులు

న్యూఢిల్లీ: కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం 'వందే భారత్ మిషన్'(వీబీఎం) చేపట్టిన విషయం తెలిసిందే. వీబీఎం ద్వారా ఇప్పటి వరకు సుమారు 60 లక్షల మంది ప్రవాసులను స్వదేశానికి తరలించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మంగళవారం వెల్లడించారు. "2020 మే 6న 64 విమానాలు, 12,800 ప్రయాణికులతో వందే భారత్ మిషన్ కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా ఇప్పటి వరకు 60.4 లక్షల మంది భారత ప్రవాసులను స్వదేశానికి తరలించడం, అలాగే భారత్ నుంచి విదేశాలకు తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం వీబీఎం ఎనిమిదో దశ కొనసాగుతోంది." అని పూరి ట్విటర్ వేదికగా వెల్లడించారు.


ఇక భారత్ సుమారు 27 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకోవడం దీనికి అదనం అని మంత్రి పేర్కొన్నారు. ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి ఆయా దేశాల మధ్య విమాన రాకపోకలకు వీలు ఏర్పడిందని పూరి తెలిపారు. కాగా, ఇటీవల భారత్.. మార్చి 31 వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై ఆంక్షలు పొడిగించిన విషయం తెలిసిందే. గతేడాది మార్చి చివరి వారం నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి, అలాగే ఇక్కడ చిక్కుకున్న వారిని ఇతర దేశాలకు తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. 



Updated Date - 2021-03-03T21:15:59+05:30 IST