దేశ భవితవ్యాన్ని చూపేది యూపీ ఎన్నికలే: అమిత్ షా

ABN , First Publish Date - 2022-01-27T20:53:31+05:30 IST

ఒకప్పుడు యూపీని గూండాలు, నేరస్తులు ఏలేవారు. పోలీసులు కూడా వారికి భయపడేవారు. మహిళలు, యువతులు ఓటు వేయడానికి భయపడేవారు. కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. గూండాలు, నేరస్తులు వాళ్లకు వాళ్లుగా పోలీసుల ముందుకు..

దేశ భవితవ్యాన్ని చూపేది యూపీ ఎన్నికలే: అమిత్ షా

లఖ్‌నవూ: దేశ భవితవ్యాన్ని నిర్దేశించేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండవసారి అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా గురువారం మధురలో అమిత్ షా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అఖిలేష్‌ను మళ్లీ గెలిపిస్తే గూండా రాజ్యం వస్తుందని అమిత్ షా విమర్శించారు.


‘‘అఖిలేష్ బాబు.. నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నావు. మీ నేత అజాం ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఆయనపై అనేక కేసులు నమోదు అయ్యాయి. కొద్దిగా సిగ్గుపడు’’ అని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు యూపీని గూండాలు, నేరస్తులు ఏలేవారు. పోలీసులు కూడా వారికి భయపడేవారు. మహిళలు, యువతులు ఓటు వేయడానికి భయపడేవారు. కానీ ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. గూండాలు, నేరస్తులు వాళ్లకు వాళ్లుగా పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోతున్నారు. వాళ్ల మెడకి వాళ్లే ఉరి బిగించుకుంటున్నారు’’ అని అన్నారు.


ఉత్తరప్రదేశ్‌ని వారసత్వవాదుల నుంచి కులవాదుల నుంచి విముక్తి చేశామని అమిత్ షా అన్నారు. ఇప్పుడు యూపీలో కొనసాగుతున్నదంతా అభివృద్ధేనని అన్నారు. 20 కోట్ల జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్ లేకుండా భారత అభివృద్ధి అసాధ్యమని, యూపీ ప్రజల నమ్మకం, అభిలాష ప్రకారం రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు.

Updated Date - 2022-01-27T20:53:31+05:30 IST