పాకిస్తాన్ బుద్ధి బయటపడింది.. సార్క్ కరోనా నిధిపై భారత్..

ABN , First Publish Date - 2020-04-10T22:30:07+05:30 IST

సార్క్ దేశాల కోవిడ్-19 అత్యవసర సహాయ నిధిపై ఆలస్యంగా స్పందించిన పాకిస్తాన్‌ను ఉద్దేశించి భారత్...

పాకిస్తాన్ బుద్ధి బయటపడింది.. సార్క్ కరోనా నిధిపై భారత్..

న్యూఢిల్లీ: సార్క్ దేశాల కోవిడ్-19 అత్యవసర సహాయ నిధిపై ఆలస్యంగా స్పందించిన పాకిస్తాన్‌ను ఉద్దేశించి భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీనిపై ఇతర సభ్య దేశాలు ఎప్పుడో ముందుకొచ్చాయనీ.. ఏయే దేశానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దాని ప్రవర్తనను బట్టే చెప్పొచ్చంటూ హితవు పలికింది. కొవిడ్-19 అత్యవసర నిధి కోసం 3 మిలియన్ డాలర్లు ఇస్తామంటూ పాకిస్తాన్ గురువారం ప్రకటించిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటించింది. కొవిడ్-19 అత్యవసర నిధి కోసం భారత్ ఆరంభంలోనే తన వంతు సాయం ప్రకటించి అమలు చేసిందనీ.. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక తదితర దేశాలకు ఇప్పటికే సహాయక సామగ్రిని పంపిందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 


కోవిడ్-19పై ఉమ్మడి పోరాటం కోసం ప్రధాని నరేంద్రమోదీ సార్క్ దేశాలను ఏకతాటి మీదికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొద్ది వారాల క్రితం జరిగిన సార్క్ దేశాధినేతల సమావేశంలో ప్రధాని మోదీ కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్‌ను ప్రతిపాదించారు. దీనికోసం భారత్ నుంచి 10 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఆ వెంటనే ఒక్క పాకిస్తాన్ తప్ప అన్ని సార్క్ దేశాలు కోవిడ్-19 అత్యవసర నిధికి తమ వంతు సాయం ప్రకటించాయి. ఆఫ్ఘనిస్తాన్ ఒక మిలియన్ డాలర్లు ప్రకటించగా.. నేపాల్ 10 కోట్ల నేపాలీ రూపాయలను ప్రకటించింది. మాల్దీవులు 2 లక్షల డాలర్లు, భూటాన్ లక్ష డాలర్లు, సార్క్ అత్యవసర నిధికి ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. అయితే ఇన్నాళ్లూ దీనిపై నోరువిప్పని పాకిస్తాన్ నిన్న హడావిడిగా 3 మిలియన్ డాలర్లు సార్క్ నిధి కోసం ప్రకటించింది. తమ దేశంలో కరోనా వైరస్ కేసులు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలోనే పాకిస్తాన్ స్పందించడం గమనార్హం. 

Updated Date - 2020-04-10T22:30:07+05:30 IST