Tokyo Olympics: టీమిండియా చారిత్రాత్మక విజయం.. భారత్‌కు నాలుగో పతకం

ABN , First Publish Date - 2021-08-05T14:23:11+05:30 IST

విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది. జర్మనీని 6-3 గోల్ తేడాతో ఓడించి కాంస్యం పట్టేసింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరింది.

Tokyo Olympics: టీమిండియా చారిత్రాత్మక విజయం.. భారత్‌కు నాలుగో పతకం

టోక్యో: విశ్వక్రీడలు ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు కాంస్యం కోసం జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో అదరగొట్టింది. జర్మనీని 5-4 గోల్ తేడాతో ఓడించి కాంస్యం పట్టేసింది. దీంతో భారత్ ఖాతాలో నాలుగో పతకం చేరింది. మ్యాచ్ ఆరంభంలో తడబడిన భారత్ ఆ తర్వాత పుంజుకుని వరుస గోల్స్‌తో ప్రత్యర్థిని రఫ్పాడించింది. చివరకు చారిత్రాత్మక విజయంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా కాంస్య పతకాన్ని ఖాతాలో వేసుకుంది. మొదటి క్వార్టర్‌లో ప్రత్యర్థి జర్మనీ 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, రెండో క్వార్టర్‌లో భారత జట్టు అదరగొట్టింది. సీమ్రన్‌జీత్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోయిన జర్మనీ వరుసగా రెండు గోల్స్ చేసి 3-1 తేడాతో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ సమయంలోనే అద్భుతం జరిగింది.


భారత్ తరఫున హర్దీక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ వరుసగా రెండు గోల్స్ చేశారు. దీంతో రెండో క్వార్టర్ ముగిసేసరికి భారత్ 3-3తో మ్యాచ్‌ను సమం చేసింది. ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో భారత జట్టుకు ఎదురులేకుండా పోయింది. జర్మనీ డిఫెండ్‌ను పూర్తిగా విడగొట్టి వరుస పెనాల్టీ కార్నర్లు సాధించడంతో పాటు వాటిని గోల్స్‌గా మలిచింది. భారత్‌కు వరుసగా రూపిందర్ సింగ్, సీమ్రన్‌జీత్ రెండు గోల్స్ అందించారు. దీంతో టీమిండియా మూడో క్వార్టర్ ముగిసే సమయానికి 5-3తేడాతో పూర్తి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 


అయితే, నాలుగో క్వార్టర్‌లో జర్మనీ ఓ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. ఇక చివరి వరకు మరో గోల్ చేసేందుకు ప్రత్యర్థి తీవ్రంగా శ్రమించిన ఫలితం లేకుండా పోయింది. భారత గోల్ కీపర్ శ్రీజేష్ అద్భుత ప్రదర్శనతో జర్మనీకి గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా గోడల నిలబడ్డాడు. చివరకు భారత్ 5-4 తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. దీంతో 41 ఏళ్ల తర్వాత భారత్ ఒలింపిక్స్‌లో పతకం సాధించింది. ఒకప్పుడు హాకీలో ఓ వెలుగు వెలిగిన టీమిండియాకు ఎదురులేకుండా ఉండేది. దీంతో గతంలో 11 పతకాలు గెలిచిన భారత్.. 1980లో మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ స్వర్ణం గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మెడల్ కూడా గెలవలేదు. ఈ కాంస్య పతకం విజయంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెర పడింది.      



Updated Date - 2021-08-05T14:23:11+05:30 IST