ఆగస్టు 10 నుంచి కువైట్, భారత్ మధ్య తాత్కాలిక విమానాలు
ABN , First Publish Date - 2020-08-07T14:56:09+05:30 IST
కరోనా సంక్షోభం వల్ల కువైట్ వెళ్లాలేకపోయిన భారత ప్రవాసులకు గుడ్న్యూస్. ఆగస్టు 10 నుంచి కువైట్, భారత్ మధ్య తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.
కువైట్ సిటీ: కరోనా సంక్షోభం వల్ల కువైట్ వెళ్లాలేకపోయిన భారత ప్రవాసులకు గుడ్న్యూస్. ఆగస్టు 10 నుంచి కువైట్, భారత్ మధ్య తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 24 వరకు ఇరు దేశాల మధ్య ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి. ఈ మేరకు రెండు దేశాల పౌర విమానయాన శాఖల మధ్య తాజాగా ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో భారతదేశ సిఫార్సులను కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆమోదించింది. విమాన సర్వీసులను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటోంది.
ఇక ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు దేశాల విమానయాన సంస్థలు రోజుకు 500 సీట్ల కెపాసిటీతో విమానాలను నడపడానికి అంగీకరించాయి. కువైట్ ఎయిర్వేస్ 300 సీట్ల సామర్థ్యంతో, జజీరా ఎయిర్వేస్ 300 సీట్ల సామర్థ్యంతో డైలీ సర్వీసులు నడపనున్నట్లు కువైట్ డీజీసీఏ పేర్కొంది. కువైట్ నుంచి కొచ్చి, కన్నూర్, కోజికోడ్, తిరువనంతపురం, ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా భారతదేశంలోని 15 విమానాశ్రయాలకు విమానాలు నడవనున్నాయి.